జిల్లాల్లోని కోవిడ్ ఆసుపత్రిలు, అలాగే క్రిటికల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారు వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ చాలా కష్టపడి సేవలు చేస్తున్నారని, తెలియని భయం ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు నేను సెల్యూట్ చేస్తున్నానని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు, కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా మీద యుద్ధంలో మీరు అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయం చాలా ఎక్కువగా కష్టపడి సేవలు అందిస్తున్నారని చెప్పారు.
వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా, అంకిత భావంతో సేవలు అందిస్తున్నారన్నారు.లాక్డౌన్ కుముందు నుంచి కూడా సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్ కేర్ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించామని, ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగిందని, పూర్తిగా వారందర్నీ ట్రేస్ చేసి వారి ప్రైమరీ కాంటాక్ట్స్ను, సెకండరీ కాంటాక్ట్స్ను పూర్తి క్వారంటైన్ లేదా ఐసోలేషన్లో ఉంచినట్లు చెప్పారు.
మొత్తం మీద పరిస్థితి అదుపులో ఉందనే చెప్పారు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నట్లు తెలిపారు. మీరందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నానాని చెప్పారు.