ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దుల్లో భారత్, చైనా సేనలు పెద్ద ఎత్తున మోహరింపు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడేళ్ళ క్రితం 2017లో డోక్లామ్ వద్ద జరిగిన సేనల మోహరింపు తర్వాత పెద్ద ఎత్తున మోహరించడం ఇదే ప్రధమం అని చెబుతున్నారు.
దీనితో లడఖ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పాంగాంగ్ సో, గల్వాన్ వ్యాలీ వద్ద దళాలను రెట్టింపు చేసినట్లు భారత ఆర్మీ పేర్కొన్నది. ఇవే ప్రాంతాల్లో చైనా ఆర్మీ సుమారు 2500 దళాలను మోహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
లడాఖ్ ప్రాంతంలో భారత సైన్యాన్ని పటిష్టం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. గల్వాన్ వ్యాలీలో ఉన్న డర్బూక్-షయాక్-డౌలత్ బెగ్ ఓల్డీ రోడ్డులో ఉన్న భారత్ పోస్టు కేఎం120 వద్ద చైనా తమ దళాలను కేంద్రీకరిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తమ బలగాలను మోహరిస్తున్నట్లు తెలుస్తోంది.
గల్వాన్ ప్రాంతంలోకి చైనా దళాలు రావడం ఆక్షేపణీయమని మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా తెలిపారు. డోక్లామ్ ఉద్రిక్తల తర్వాత 2018లో ఉభయ దేశాల అధినేతలు చైనాలోని ఉహాన్ వద్ద సమావేశంపై తమ తమ సేనలను సంయమనం పాటించమని చెప్పాలని నిర్ణయించారు. ఆ తర్వాత పరిస్థితులు కొంతమెరుగుపడ్డాయి.
అయితే లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా గత ఏడాది భారత్ చేసినప్పటి నుండి అది తమ భూభాగం అంటూ చైనా నిరసన ధ్వనులు వినిపిస్తూ వస్తున్నది. ప్రస్తుతం మొత్తం ప్రపంచం కరోనా మహమ్మారితో తలమునకలై ఉన్న సమయంలో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలకు దారితీయడం గమనార్హం.
గల్వాన్ వ్యాలీలో చైనా బలగాలు సుమారు వంద టెంట్లను వేసినట్లు చెబుతున్నారు. దీంతో సమస్యాత్మకంగా మారిన డెమ్చోక్, దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతాల్లో భారత దళాలు పెట్రోలింగ్ను పెంచాయి.