Chandrababu: తెలుగుదేశం పార్టీ మూడో జాబితా పై చంద్రబాబు ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, పార్లమెంట్ స్థానానికి సంబంధించి 13 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొందరి ఆశావహులపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కాయి. మరికొందరికి మాత్రం చంద్రబాబు షాక్ ఇచ్చారు. చాలామంది సీనియర్లకు గాల్లో ఉంచారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మూడో జాబితాలో సైతం చోటు దక్కలేదు. చీపురుపల్లి ఆప్షన్ మాత్రమే ఉంచినట్లు తెలుస్తోంది. టిడిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సైతం చోటు దక్కలేదు. ఎచ్చెర్ల సీటును ప్రకటించలేదు. శ్రీకాకుళంలో సీటు ఆశించి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి భంగపడ్డారు. డబ్బు సంచులకే కొందరు నేతలు ప్రాధాన్యం ఇచ్చారని ఆమె ఆరోపించారు. పాతపట్నం టికెట్ ను సైతం కొత్తగా వచ్చిన మామిడి గోవిందరావుకి ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి హ్యాండ్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా తమను పక్కన పెట్టారని ఆ ఇద్దరు నేతలు చెప్పుకొచ్చారు. మైలవరంలో దేవినేని ఉమాకు హ్యాండ్ ఇచ్చారు. 100 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సైతం న్యాయం చేయలేదు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా మరోసారి మొండి చేయి చూపారు. నెల్లూరు నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి టికెట్ ఇచ్చారు.
అయితే ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలే పెండింగ్ లో ఉన్నాయి. అటు నాలుగు పార్లమెంట్ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అయితేమాజీ మంత్రి కళా వెంకట్రావు ఎచ్చెర్ల సీటును ఆశిస్తున్నారు. మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి సీటు పై ఆశలు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు చీపురుపల్లి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. కానీ వారు అయిష్టత చూపుతున్నారు. తాము ఆశించిన సీట్లు కావాలని అడుగుతున్నారు. దీంతో ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. అయితే తుది జాబితాలోనైనా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి నేతలకు న్యాయం జరుగుతుందో? లేదో? చూడాలి.