మీతో పాటు ఐదుగురికి భోజనం పెట్టాలంటూ ప్రధాని మోదీ ప్రజలందరికీ పిలుపునిస్తే.. ఏపీలో పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మూసేసిన చరిత్ర సీఎం జగన్ దే అని దుయ్యబట్టారు.
తెదేపా నేతలతో చంద్రబాబు వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప.. మండలం ప్రాతిపదికగా తక్కువగా చూపించడం దురుద్దేశపూర్వకమేనని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం సరికాదని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడిన రమేష్ కుమార్ ను ఎస్ఈసీ పదవి నుంచి తొలగించడం దుర్మార్గచర్య అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. రాజకీయ లాభాలే తనకు ముఖ్యమనేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలోనూ అనేక జిల్లాలలో అక్రమ మైనింగ్ కు వైకాపా నేతలు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో వందల ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునేవారు లేరని దుయ్యబట్టారు. గ్రావెల్ ను అక్రమ తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయకుండా.. సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే ట్రాక్టర్లను సీజ్ చేయడం హేయమన్నారు.