కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికుల జీనోపాధికి సంబంధించిన సమస్యలు మరియు వారికి సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే, ఏప్రిల్ 20 నుండి పరిస్థితుల అంచనా ప్రకారం కొన్ని చోట్ల లాక్ డౌన్ లో షరతులతో కూడిన సడలింపు ఇస్తామని ప్రధాని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు, వలస కూలీలు ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఈ కేంద్రాలను సంప్రదించవచ్చు. ఈ నియంత్రణ గదులను లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ప్రాంతీయ కార్మిక కమిషనర్లు మరియు ఆయా ప్రాంతాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్లు నిర్వహిస్తారు. మొత్తం 20 కాల్ సెంటర్ల పనితీరును ప్రధాన కార్యాలయ చీఫ్ లేబర్ కమిషనర్ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
లాక్ డౌన్ కారణంగా కార్మికులు మరి ముఖ్యంగా వలస కూలీలు పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో వలస కూలీలు జీవనోపాధి కోల్పోయారు. ఈ లాక్ డౌన్ కారణంగా భారతదేశంలో 40 మిలియన్ల అనధికారిక రంగ కార్మికులు తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.