YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది. నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు జరుగుతున్నా కేసు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటివరకూ సిట్ లు మారుతున్నా.. వేర్వేరు చార్జిషీట్లు దాఖలు చేసినా ఏ ఒక్కటీ కొలిక్కి రాకపోవడం వెనుక రాజకీయ కోణాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా సీబీఐ కొత్త ‘సిట్’ను నియమించింది. ఇప్పటిదాకా దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్పీ రాంసింగ్ను సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ కేసు నుంచి తప్పించింది. కొత్తగా డీఐజీ కేశవ్రామ్ చౌరాసియా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇందులో… ఎస్పీ వికాస్ కుమార్, అదనపు ఎస్పీ ముఖేశ్ శర్మ, ఇన్స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పుణియ, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సీబీఐ బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీనిని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం ఆమోదించింది. మరోవైపు కేసులో నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ఉపసంహరించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏకంగా విచారణ అధికారిని మార్చాలని..
వివేకా హత్యకేసు దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని.. విచారణ అధికారిని మార్చాలంటూ నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు ఏప్రిల్ 30లోగా దర్యాప్తును ముగించాలని స్పష్టం చేసింది. దీంతో సీబీఐ కొత్త టీమ్ దర్యాప్తునకు సిద్ధమవుతోంది. కాగా తులసమ్మ తన భర్త శివశంకర్ రెడ్డి బెయిల్ కోరగా.. న్యాయమూర్తులు నిరాకరించారు. ఇప్పటికే బెయిల్ పిటీషన్ రద్దుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటుచేసిన కొత్త సిట్ తో కేసు మళ్లీ మొదటికి వచ్చినట్టయ్యింది.
బెయిల్ పిటీషన్ వెనక్కి…
మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి సరిగ్గా ఇదే సమయంలో తన ముందస్తు బెయిల్ పిటీషన్ ను వెనక్కి తీసుకున్నారు. రిజిస్ట్రీ వద్ద ఉన్న పిటీషన్ ను అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. సుప్రీం కోర్టు కొత్త సిట్ ఏర్పాటుచేయడంతో అవినాష్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే సీబీఐ కఠిన చర్యలను నియంత్రించాలని తొలుత అవినాష్ రెడ్డి పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణకు హాజరుకావాలని.. సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగింది. అందుకే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. సుప్రిం కోర్టు తాజా నిర్ణయంతో ఇప్పడు అవినాష్ రెడ్డికి ఉపశమనం కలిగిందని.. అందుకే బెయిల్ పిటీషన్ వెనక్కి తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.
30లోగా విచారణ సాధ్యమేనా?
అయితే సీబీఐ చెబుతున్నట్టు ఏప్రిల్ 30లోగా విచారణ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వివేకా 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. నాలుగేళ్లు దాటుతున్నా కేసు కొలిక్కి రాలేదు.హత్యకు గురైంది సాక్షాత్ మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయ్. పైగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి కూడా. దారుణంగా హత్యకు గురైతే, చంపిన వారు నాలుగేళ్లుగా కస్టడీలోనే ఉండగా.. విచారణ మాత్రం ఎందుకు యేళ్లకు ఏళ్లు సాగుతుందో సామాన్యులకు అర్థం కాదు. యేళ్లకు యేళ్లు సాగే ఈ విచారణ ఫుల్ స్టాప్ పడే పరిస్థితులేవీ కనిపించడం లేదు. న్యాయం కోసం వివేకా కుమార్తె సునీత పోరాడుతున్నారు. తమకు సంబంధమే లేదని ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వాదిస్తున్నారు. సీబీఐ విచారణ కూడా సహేతుకంగా లేదు. సిట్ ల సిట్ లు ఏర్పాటుచేస్తున్నారే తప్ప కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం లేదు. ఇటువంటి తరుణంలో కొత్తగా ఏర్పాటుచేసిన సిట్ పైన కూడా అనుమానాలు నెలకొన్నాయి.