Minister Anil Kumar: ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం కాస్త ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి అనిల్ దందాలు చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆగడాలు శృతి మించాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలు గుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా తమ దారికి అడ్డం వస్తే వారిని టార్గెట్ చేసి మరీ బెదిరిస్తున్నారని.. వినకపోతే దాడి చేస్తున్నారని తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు.
Minister Anil Kumar
ఈ క్రమంలోనే మంత్రి అనిల్ కుమార్పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలోని పెన్నా కాల్వకు సంబంధించిన టెండర్ల విషయంలో జరిగిన గోల్మాల్ వ్యవహారం హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఆ టెండర్లను ఖరారు చేసేముందు రివర్స్ టెండర్లకు వెళ్లారు. అయితే, అందులో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి అనిల్ కుమార్, అతని బాబాయ్ నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ బెదిరించినట్లుగా కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు.
Also Read: వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం అవసరమా జగన్ ?
హైదరాబాద్లో ఈ బెదిరింపులకు పాల్పడటంతో కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ 24వ తేదీన 506, 504 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్, వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను నెల్లూరు టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేశారు. ఈ కేసు విషయంలో మంత్రి అనిల్, అతని బాబాయ్ రూప్కుమార్కు, మరో వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చారు.
పోలీసుల రాసిన ఎఫైఆర్లో మరొక ఫోన్ నంబరు ఉందని, అది మంత్రిదేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇస్తారని ప్రచారం సాగుతోంది. కాగా, ఈ కేసును ఉపసంహరించుకోవాలని కాంట్రాక్టర్తో మంత్రి బాబాయ్ రూప్ కుమార్ బేరసారాలకు దిగుతున్నారని నెల్లూరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ కేసు రాజీ పడిపోతారో లేకపోతే.. పొరుగు రాష్ట్రంలో మంత్రి అనిల్పై కేసు నమోదవుతుందో చూడాలి. నెల్లూరు రాజకీయాల్లో ఈ కేసు మాత్రం కలకలం రేపుతోంది.
Also Read: వారానికో నేతను చేర్చుకుంటారంట.. వారిపైనే చంద్రబాబు ఆశలు..