ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ఆయన ప్రతీకార చర్యలు మొదలైనట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఐడీ తీరుపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాత్ సింగ్ కు రఘురామ ఫిర్యాదు చేశారు. అక్కడే కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి సీఎం జగన్ పై , ఏపీ పోలీస్ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు.
తాజాగా ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఏపీ సీబీసీఐడీ పోలీస్ చీఫ్ సునీల్ కుమార్ పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఆయన మీడియాకు విడుదల చేశారు. తన పట్ల వ్యవహరించిన తీరు.. తన ఫోన్ ను తిరిగి ఇవ్వని నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మే 14న తనను ఏపీ సీఐడీ అధికారులు గచ్చిబౌలిలోని తన ఇంటినుంచి అరెస్ట్ చేశారని ఆ సమయంలో తన విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. నా ఐఫోన్ 11 మోడల్ ను తీసుకున్నారని.. దాని సిమ్, వాట్సాప్ ను కూడా నా అనుమతి లేకుండా ఓపెన్ చేసి చూశారని.. తన కీలక మైన సమాచారాన్ని అంతా చోరీ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఇప్పటికే సీఐడీ చీఫ్ కు లీగల్ నోటీసులు జారీ చేశానని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నా ఫోన్ నంబర్ల నుంచి ఇతరులకు వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నారని.. సీఐడీ పోలీసుల వద్దనున్న నా ఫోన్ ను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో ఎంపీ రఘురామ కోరారు.
రిటైర్డ్ ఐఏఎస్, సీఎం సలహాదారుగా చేసిన పీవీ రమేశ్ కు నా సెల్ ఫోన్ నంబర్ నుంచి తప్పుడు మెసేజ్ లు పెడుతున్నారని.. ఆ ట్వీట్లకు తనకు సంబంధం లేదని రఘురామ వివరణ ఇచ్చారు. నా ఫోన్ ఏపీ సీఐడీ పోలీసుల వద్దే ఉందని.. వారే చర్యలు తీసుకోవాలని కోరారు.