Huzurabad elections: ఒకాయన నామినేషన్ వెయ్యకముందే ఆస్పత్రి బెడ్పై పడ్డాడు. మరో నేత తనపై దాడి చేయించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాడట. ఇంకో నాయకుడు ప్రచారానికి వెళ్లేందుకు జంకుతున్నాడట. అందుకే వెంట మంత్రో, ఎమ్మెల్యేనో ఉంటే తప్ప ఇంటింటికీ వెళ్లటం లేదట. ఇలా మొత్తానికి ప్రధాన పార్టీలు హుజురాబాద్ ఉప ఎన్నిక గెలిచేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయట.
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్క నియోజకవర్గ ఎన్నికలనైనా సాధారణ ఎన్నికలను తలపించేలా ఫోకస్ చేస్తున్నాయి. ఎవరి ప్రణాళికలు వారివన్నట్టు ఎదుటిపార్టీని ఇరకాటంలో పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ ఎప్పుడో రెడీ అయిపోయి ప్రజల్లో కలియతిరుగుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ యువనాయకుడు గెల్లు శ్రీనివాస్ ఆ పార్టీ బీఫాంతో తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ కండువా కప్పుకుని ఇటు ఈటల రాజేందర్, అటు ఈటల జమున ఇద్దరూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వారిలో ఎవరో ఒకరికి బీజేపీ అధిష్టానం సీట్ కన్ఫాం చేస్తుందట. దాదాపు ఈటల జమున బరిలో నిలిపేందుకు చర్చలు సాగుతున్నాయట.
ఎన్నికల సమీపిస్తుంటే ఏవేవో ఇన్సిడెంట్స్ జరగడం పరిపాటిగా మారుతోంది. యాదృశ్చికమో, కల్పితమో తెలియదుగానీ ఎన్నికల సమయంలో ఇలాంటివి జరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడక తప్పదనే చెప్పాలి. బీజేపీ రెండోసారి ఎన్నికలకు వెళ్లినప్పుడే పుల్వామా దాడి ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో సెంట్రల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకొచ్చింది. ఇదో ఉదాహరణ మాత్రమే. కచ్చితంగా ఎన్నికల కోసమే జరిగిందని చెప్పలేం. అలానే మన రాష్ట్రంలోనూ ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చి ఓట్లు పొందటం సహజమైపోయిందని విశ్లేషకుల భావన. కరీంనగర్ ఎంపీ ఎన్నికలప్పుడు బండి సంజయ్ సొమ్మసిల్లి పడిపోయారు. అప్పుడు ఆయన కరీంనగర్ పార్లమెంట్లో ఫోకస్ అయ్యారు. వెంటనే జరిగిన ఎన్నికల్లో ఎంపీ కూడా అయ్యారు. ఇటీవల దుబ్బాక ఎన్నికలప్పుడు కూడా బండి సంజయ్ మీద దాడి జరిగింది. ఈ ఘటనలో రఘునందన్రావు చెయ్యి కూడా విరిగినట్టు, కట్లతోనే ప్రచారంలో పాల్గొన్నట్టు మనం టీవీల్లో చూశాం. అంతకు ముందు కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణిస్తే పరామర్శించడానికి వెళ్లినప్పుడు పోలీసులకు, బీజేపీ నాయకులకు తోపులాట జరిగింది. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. అటుతర్వాత బండి సంజయ్ సుడి తిరిగింది. బీజేపీ అధిష్టానం దృష్టిలో పడి ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడి హౌదా పొందారు. వ్యక్తిగతంగా అంచెలంచెలుగా ఎదిగేందుకు ఇలాంటి ఘటనలు చాలా దోహదం చేసాయనేది విశ్లేషకుల అంచనా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలంటి ఘటనలు అనేకమున్నాయి.
ఇదే ఫార్మూలాను హుజూరాబాద్ ఎన్నికల్లో వాడేందుకు ప్రతిపక్ష, అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయట. బీజేపీ అభ్యర్థిగా చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ఇటీవల పాదయాత్ర చేస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి చేర్చి చికిత్స అందించి మోకాలుకు శస్త్రచికిత్స చేశారు. అప్పుడు కార్యకర్తలు, ప్రజలు అయ్యోపాపం అనుకున్నారు. సానుభూతి పెరిగింది. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోలీసుల లాఠీదెబ్బలు తిని ఆస్పత్రి బెడ్ ఎక్కాడు. మరో వైపు మంత్రులను వెంటబెట్టుకొని మరీ గెల్లు శ్రీనివాస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నారట..