BL Santhosh: ‘మోదీ.. నీ సీబీఐ వస్తదా.. నీ ఈడీ వస్తదా రమ్మను.. ఎవడు వచ్చినా ఏం పీకలేడు.. నాకే ఓ చాయ్ తాగిపిచ్చి పోతరు.. తప్పు చేసినోడ భయపడాలె.. మాకే భయం రమ్మను ఎవడొస్తడో..’ నాలుగు నెలల క్రితం నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలివవీ. అంతటితో ఆగలేదు. ‘నరేంద్ర మోదీ నువ్వు గోకినా గోకకున్నా.. నేను నిన్ను గోకుతా.. తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తు ఊరుకోం’ అని హెచ్చరించారు. అందులో బాగంగానే రెండు నెలల క్రితం ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఎపిసోడ్ ప్రారంభించారు. కానీ రెండు నెలల తర్వాత ఆ సీరియల్ అట్టర్ ప్లాప్ అని తేలింది. సీన్ రివర్స్ అయింది. ‘నువు గోకినా గోకకున్నా గోకుత’ అన్న కేసీఆర్కు తాను ఎవరిని గోకానో అన్న తత్వం బోధపడినట్లుంది. ఇక ఇప్పుడు కేంద్రమే గోకుడు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ‘చీమా.. చీమా.. ఎందుకు కుట్టావ్ అంటే.. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా’ అన్న చందంగా మారింది. కేంద్రంతో, ప్రధాని నరేంద్ర మోదీతో గిచ్చి కయ్యం పెట్టుకున్న కేసీఆర్కు ఇక దబిడి దిబిడే అన్న టాక్ రాజకీయ వర్గాల్లో రీ సౌండ్ వస్తోంది.

తెలంగాణకు బీఎల్.సంతోష్..
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న సంకల్పంతో కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి తెచ్చారు. ఈకేసు విచారణకు హడావుడిగా ఐదుగురు ఐపీఎస్లతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ద్వారా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ను మొదట ఇందులోకి లాగే ప్రయత్నం చేశారు. తర్వాత మోదీ, అమిత్షాను కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. బీఎస్.సంతోష్కు సిట్ ద్వారా మూడుసార్లు నోటీసులు ఇప్పించారు. కానీ సంతోష్ హాజరు కాలేదు. ఎమ్మెల్యేల ఎర కేసులో ఎలాగైనా అరెస్టు చేసి, ఆయనను విచారించాలని భావించిన బీఎల్.సంతోష్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. సంతోష్ పర్యటన నేపథ్యంలో ఆయనను ట‘చ్ చేయండి చూద్దాం’ అన్నట్టుగా బీజేపీ నేతల తీరు ఉంటే, సిట్ అధికారులు ఏం చేయాలన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. సంతోష్పై సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన క్రమంలో, కోర్టు సిట్ నోటీసులపై స్టే విధించడంతో ప్రస్తుతం ఆయన రాక ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక రాజకీయ విశ్లేషకులలో ఇది కవ్వింపు చర్యే అంటున్నారు.
కోరలు తీసిన పాము సిట్..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసి బీజేపీ నాయకులను ఇరికించాలని భావించారు. సిట్ విచారణ దూకుడుగా సాగి బీజేపీ నేతలకు ఉచ్చు బిగుస్తుంది అని భావిస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చేలా తయారయ్యాయి. అయితే నోటీసులు జారీ చేసిన ప్రతి ఒక్కరూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు, వారి నోటీసులపై స్టే విధించింది. దీంతో సిట్ అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇటువంటి పరిస్థితులలోనే బీఎల్.సంతోష్ను అరెస్ట్ చేసి తీరుతామని శతవిధాల ప్రయత్నం చేసిన సిట్ అధికారులు ఇప్పుడు బీఎల్.సంతోష్ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్లలో దక్షిణాది రాష్ట్రాల శిక్షణ తరగతులు..
విచిత్ర పరిస్థితుల మధ్య హైదరాబాద్కు బీఎల్.సంతోష్ వస్తున్నారు.
ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో జరగనున్న ఈ శిక్షణ తరగతుల్లో సంతోష్ పాల్గొగంటారు. 29న అసెంబ్లీ ఇన్చార్జీలు, కన్వీనర్లు, విస్తారక్లు, పాలక్లకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర శిక్షణ తరగతులు, కార్యవర్గ సమావేశాలకు బీఎల్.సంతోష్ హాజరుకాలేదు. అప్పుడు గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఆ పనుల్లో బిజీగా ఉండడం తో రాలేకపోయారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు విచిత్ర పరిస్థితుల మధ్య హైదరాబాద్ కు వస్తున్నారు.
తెలంగాణాలోకి రెడ్ కార్పెట్
రాష్ట్రంలో తాజా పరిస్థితులు బీఎల్.సంతోష్ను ఎమ్మెల్యేల ఎర కేసు అనుమానితుడుగా భావించి దర్యాప్తు చేయాలని సిట్ అధికారులు గట్టిగా భావిస్తున్న నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా లేవు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సంతోష్ కాలు పెట్టబోతున్నారు. ఇక ఆయన రావడానికి ముందే తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిస్థితులు కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈడీ ఎంటర్ కావడం, తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐ చేతికి ఇవ్వాలని ఆదేశించడ వంటి పరిణామాలు సంతోష్కు తెలంగాణ రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.

మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపపీ కార్యక్రమాల్లో సంతోష్ పాల్గొని వెళ్లిపోతే తెలంగాణ ప్రభుత్వం అసమర్థంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రాజకీయ ఉద్దండుడు అయిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏమైనా కొత్త ప్లాన్ వేస్తారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.