ఏపీలో పరిషత్ ఎన్నికలపై బీజేపీ పోరుబాట పట్టింది. గత ఏడాది కరోనా ప్రబలిన సమయంలో నామినేషన్ల అనంతరం ఈ ఎన్నికలను నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాయిదా వేశారు. అయితే తాజాగా ఆయన దిగిపోయి ఎస్ఈసీగా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టారు.
ఆమె వచ్చీరావడంతో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో నాడు వేసిన నామినేషన్లను అలాగే కొనసాగిస్తూ ఆ అభ్యర్థులే పోటీలో నిలిచేలా ప్రక్రియను అప్పటి నుంచే ప్రారంభించారు.
అయితే దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. కొత్తగా పోటీచేసేందుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా సంవత్సరం కిందట వేసిన నామినేషన్లతోనే పోటీ నిర్వహించడంపై బీజేపీ భగ్గుమంది.
ఈ క్రమంలోనే ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణ జరుపుతోంది.
ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు కూడా హైకోర్టుకు ఎక్కారు. దీంతో ఈ నోటిఫికేషన్ ఆగే అవకాశాలే కనిపిస్తున్నాయి.