Raghunandan Rao Vs Minister Niranjan Reddy: చైనా ‘మో’తో ఆ మంత్రికి లింకేటి? రఘునందర్‌ ఆ రహస్యం కనిపెట్టారా?

భూ ఆక్రమణల వివాదం కొనసాగుతుండగానే రఘునందన్‌రావు మంత్రి నిరంజన్‌రెడ్డిపై మరో బాంబు పేల్చారు. భూ అక్రమణలపై ఈడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తరచూ చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మాట్లాడుతున్నారని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : April 26, 2023 1:10 pm
Follow us on

Raghunandan Rao Vs Minister Niranjan Reddy: తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు నీడలా వెంటాడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెంట పడుతున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌. భూ ఆక్రమణలు, తహసీల్దార్‌ కార్యాలయం కాలిపోవడం, ఫామ్‌హౌస్‌ల నిర్మాణం తదితర వివరాలను ఆధారాలతో బయటపెడుతున్నారు. మరోవైపు నిరంజన్‌రెడ్డి ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. రఘునందన్‌తోపాటు మీడియాను తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్తానని ప్రకటించారు. రఘునందర్‌ కూడా అందుకు రెడీ అని ప్రకటించారు.

తాజాగా చైనా ‘మో’తో సంబంధాలపై..
ఒకవైపు భూ ఆక్రమణల వివాదం కొనసాగుతుండగానే రఘునందన్‌రావు మంత్రి నిరంజన్‌రెడ్డిపై మరో బాంబు పేల్చారు. భూ అక్రమణలపై ఈడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి తరచూ చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ విదేశీ లావాదేవీలపై కూడా ఈడీ విచారణ కోరుతామని స్పష్టం చేశారు. మంత్రి తన పాత ఫోన్‌ నంబర్‌ నుంచి తరచుగా చైనాకు కాల్స్‌ వెళ్లాయని చెబుతూ చైనాకు చెందిన ఓ వ్యక్తితో అర్ధిక లావాదేవీలు జరిగాయని వాటిని కూడా బయటపెట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. చైనాకు చెందిన ‘మో’తో మంత్రికి సంబంధం ఏమిటి? అన్నిసార్లు ఎందుకు ఫోన్‌ చేస్తున్నారు?. అని ప్రశ్నించారు.

ఆధారాలతోనే ఆరోపణలు..
మంత్రి నిరంజన్‌రెడ్డిపై తాను నిర్దిష్టంగా ఆరోపణలు చేశానని, అవేమి గాలి మాటలు కాదని రఘునందన్‌ చెబుతున్నారు. సర్వే నంబర్‌ 65 మినహా మంత్రి ఏ ఒక్క అంశంపై మంత్రి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. 1973–74 పణీల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చెబుతూ ఆర్డీఎస్‌ భూముల్ని మంత్రి తన క్షేత్రాల్లో కలపుకున్నామని స్పష్టం చేశారు. మంత్రి నిజం ఒప్పుకోవాలని, సర్వే నంబర్‌ 60లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఎంతో లెక్క తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆక్రమణ లేదని ఆధారాలేవి?
తాను చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి కబ్జాలకు పాల్పడకపోతే ఆధారాలు మాత్రం చూపడం లేదు. దీంతో ఆధారాలు బయటపెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. విదేశాల్లో ఉన్న వారు భూములు ఎలా కొనుగోలు చేశారని, ఆ సమాచారం ఆర్బీఐకు తెలియ చేశారా? అని ప్రశ్నించారు. పహాణీలలో ఉన్న పత్రాలను తాను బయటపెట్టానని, తన దగ్గర ఉన్న పత్రాలు తప్పుడు పత్రాలైతే అసలు పత్రాలను మంత్రి బయట పెట్టాలని రఘునందన్‌ సవాల్‌ చేశారు.

మొత్తంగా బీఆర్‌ఎస్‌ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్న కవిత లిక్కర్‌ స్కాం, నిన్న కేటీఆర్‌ను టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బుక్‌ చేసిన బీజేపీ తాజాగా నిరంజన్‌రెడ్డి కబ్జాల బాగోతాన్ని బయటపెట్టింది. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు నిరంజన్‌రెడ్డి నిజ స్వరూపం ఇదా అని ముక్కున వేలేసుకుంటున్నారు.