Natu Natu Modi : కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొంది. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, మధ్యలో జనతాదళ్.. ఎవరి లెక్కలు వారివే. అధికారంలోకి మేము వస్తామంటే.. మేము వస్తాము అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో కూడా తగ్గేదే లేదు అనుకుంటూ దూసుకు వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి ఇప్పటికే రెండుసార్లు కర్ణాటక వచ్చారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇటు జనతాదళ్ నుంచి కుమారస్వామి కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని చుట్టివస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిన్న అవకాశాన్ని కూడా రాజకీయ పార్టీలు వదులుకోవడం లేదు. అయితే ఇందులో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారం కర్ణాటక ఓటర్లను ఆకర్షిస్తున్నది. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం చూస్తే ఆశ్చర్యం అనిపించక మానదు.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాట ఎంత ఫేమసో తెలుసు కదా.. ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా నాటు నాటు పాట వినిపిస్తోంది. పైగా ఆ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చింది. ఆయన సోదరుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. వారంతా తమ ఫోల్డ్ లో వ్యక్తులు అనుకుందో ఏమో… నాటు నాటు పాటను తమ రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నది.
ఈ పాటలో నాటు నాటుకు బదులు మోదీ మోదీ అంటూ పదాలను చేర్చారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశామో ఈ పాట ద్వారా వివరిస్తున్నారు. గత మూడేళ్లలో శివమొగ్గ ఎయిర్పోర్ట్, బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభం, మెట్రో రైలు ప్రారంభం.. ఇలా కర్ణాటకలో పూర్తి చేసిన పలు పనుల వివరాలు, కేంద్రంలోని నరేంద్ర మోదీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రవేశపెట్టిన పలు పథకాల వివరాలతో నాటు నాటు రీమిక్స్ పాటను చిత్రీకరించి బిజెపి నాయకులు వాటిని వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఈ పాటను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారింది.
గతంలో 2009లో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్ జయహో పాటను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జై హో కాంగ్రెస్ అంటూ రీమిక్స్ చేసి ఎన్నికల ప్రచారం లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న నాటు నాటు పాటను బిజెపి నాయకులు మోదీ మోదీ అంటూ రీమిక్స్ చేశారు. జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఎన్నికల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రోజుకు ఒక తీరుగా ఎత్తుగడ వేస్తున్నాయి. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఓటర్ల మదిలో ఏముందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే ప్రచారంలో అన్ని పార్టీలు కొత్త కొత్త ఒరవడు లకు శ్రీకారం చుడుతున్నాయి.
*"Modi Modi Modi"*
This catchy song is based on the hit RRR song highlighting the achievements of the BJP government. pic.twitter.com/mH7QK94MC5— jagdish sista (@JagdishSista1) April 12, 2023