మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే మిగిలి ఉంది. ఈ నెల 8న చేరిక జరగనున్నట్టు సమాచారం. అయితే.. ఆయన చేరికపై ఓ వర్గం సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరో వర్గం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త నేతలంతా వచ్చి ఆధిపత్యం చెలాయిస్తే.. ఎన్నాళ్లుగానో పార్టీని నమ్ముకొని ఉన్న తమ పరిస్థితి ఏంటన్నది వారి ఆవేదన. ఇప్పటికే పార్టీలో ఉన్న ఈ పంచాయితీ.. ఇప్పుడు మరింత రాజుకుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ వివేక్.. ఆధిపత్యం కొనసాగుతోందని స్థానిక నాయకులు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఈటలను బీజేపీలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర పెద్దదే అని చెప్పుకుంటున్నారు. దీంతో.. ఇద్దరూ కలిసి తమకు ఎర్త్ పెడతారని ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే.. ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ కు చెందిన పెద్దిరెడ్డి ఓపెన్ గానే వ్యతిరేక గళం వినిపించారు. ఈటల బీజేపీలోకి వస్తే తన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీంతో.. మిగిలిన నియోజకవర్గాలకు చెందిన నేతలు కూడా తమ పరిస్థితిని ఏకరువు పెడుతున్నారు. ఇతర పార్టీల్లోంచి వచ్చిన నేతలు తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ కారణంగానే.. ఈటలను ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ విషయం అధిష్టానం వద్దకు సైతం వెళ్లిందని సమాచారం. అయితే.. ముఖ్యమైన నేతలను చేర్చుకోకుండా పార్టీ ఎలా బలపడుతుందని పార్టీ పెద్దలు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అందుకే.. అయిష్టంగానే పలువురు ఈటలను స్వాగతించాల్సిన పరిస్థితి వచ్చిందట.
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చాటుకుంటున్న వేళ.. పార్టీ బలపడాలంటే ఈటల వంటి నేతలు అవసరమని పెద్దలు భావిస్తుండడంతో మిగిలిన వారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. అదే సమయంలో అసంతృప్తితో ఉన్నవారిని పలు విధాలుగా బుజ్జగిస్తున్నారట. మరి, భవిష్యత్ లో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.