BJP Party : బిజెపికి ముందుంది ముసళ్ళ పండగ

జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే 46 సీట్లు గెలుపొందాలి. అయితే.. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేయడం ఇప్పుడు బీజేపీకి అంత సాధ్యపడేనా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఆ పార్టీ తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండలా తయారయ్యాయంట.

Written By: Chai Muchhata, Updated On : September 15, 2024 5:22 pm

BJP Party

Follow us on

BJP Party : గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడి గెలిచినంత పనే అయింది. చావు తప్పి కన్ను లొట్ట పడ్డ చందంగా చివరకు అధికారం అయితే దక్కింది. 400 సీట్ల వరకు వస్తాయని కలలు గన్న బీజేపీ నేతలకు ఓటర్లు పెద్ద ఎత్తున షాక్ ఇచ్చారు. అంతకుముందు రెండు పర్యాయాలు ఏకపక్షంగా ఫలితాలు వచ్చినా.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం పరీక్ష ఎదుర్కోక తప్పలేదు. చివరకు హ్యాట్రిక్ విజయంతో మోడీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు బీజేపీ మరో పరీక్ష ఎదుర్కోబోతోంది. అది జమ్మూకశ్మీర్, హర్యాల రాష్ట్రాల ఎన్నికల రూపంలో. ఇప్పటికే లోక్‌సభలో సరైన మెజార్టీ లేక.. మిత్రపక్షాల సహకారంతో అధికారం చేపట్టిన బీజేపీకి ఈ ఎన్నికలు మరింత టాస్క్‌లా మారాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు పడుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ సత్తా చాటి బీజేపీ హవా కొనసాగించాలని ఉవ్విల్లూరుతోంది. అయితే.. కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో బీజేపీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ కూడా ఈ ఎన్నికలను చాలెంజింగ్‌గా తీసుకుంది. ఇక్కడ బీజేపీని ఓడగొట్టి మరోసారి బీజేపీని దెబ్బతీయాలని చూస్తోంది.

జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే 46 సీట్లు గెలుపొందాలి. అయితే.. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేయడం ఇప్పుడు బీజేపీకి అంత సాధ్యపడేనా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఆ పార్టీ తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండలా తయారయ్యాయంట. ఇప్పటికే హర్యానాలో రెండుసార్లు బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు జమ్మూకశ్మీర్‌లోనూ తన హవాను అలాగే కొనసాగించాలని అనుకుంటోంది.

అయితే.. హర్యానాలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ రైతు వ్యతిరేక చట్టాలు ఆ పార్టీ దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. రెజ్లర్ల ఆందోళనలు సైతం ఆ పార్టీకి నెగెటివ్ కావచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిణామాలు కాస్త గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.

ఇక.. జమ్మూకశ్మీర్‌కు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో జతకట్టింది. బీజేపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్‌కు జమ్మూలో నేషనల్ కాన్ఫరెన్స్ తోడవ్వడంతో అక్కడ ఆ పార్టీకే గెలుపు అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఆర్టికల్ 370 రద్దును కూడా అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. దీంతో అక్కడ మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే.. ప్రస్తుతం రెండు చోట్ల కూడా బీజేపీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోందనే చెప్పాలి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే.. ముందు ముందు జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపైనా ఆ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.