బీజేపీ ఇన్ చార్జి తరుణ్ చుగ్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పాటించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈటల చేరికతో టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ జాతీయ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్న తీరుపై ఆరా తీశారు. భవిష్యత్తులో చేపట్టబోయే విధానాలపై కూలంకశంగా చర్చించారు. పార్టీ ప్రతిష్టను ఇనుమడింపచేసే కార్యక్రమాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు.
కేసీఆర్ కు కష్టమొచ్చిన ప్రతిసారి బీజేపీని ఉపయోగించుకుని తరువాత ముఖం చాటేస్తున్నారు. ఇకపై కేసీఆర్ మాయలో పడకూడదని నిర్ణయించారు. ఇదే సందర్భంలో ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాల్సిందిగా నిర్ణయించారు. విచారణ చేపడితేనే బీజేపీపై ఉన్న అపోహలు తొలగుతాయని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పదేపదే విచారణ గురించి చెబుతూనే ఉన్నారు. ఈటలను పార్టీలో చేర్చుకున్న తరువాత టీఆర్ఎస్ పై తృణమూల్ దాడిచేసినట్లుగా చేయకపోతే పార్టీని ఇతర నేతలు నమ్మరని చెబుతున్నారు. అందుకే 14న ఈటల పార్టీలో చేరిన తరువాత అసలు రాజకీయం ఉంటుందని బీజేపీ నేతలు సెలవిస్తున్నారు.