డ్రాగన్ దేశం చైనా.. పొరుగు దేశాలపై తన పెత్తనం చెలాయించాలని చూస్తోంది. ముఖ్యంగా ఇండియా మీద తన దూకుడును పెంచాలని కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా సైతం అదే ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్–చైనా సరిహద్దులో నెలకొన్ని ఉద్రిక్త వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు శాంతియుత పరిష్కారానికి బాటలు వేయాలని బైడెన్ పాలకవర్గం ఆకాంక్షించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి సోమవారం విలేకరులతో మాట్లాడారు.
Also Read: ట్రంప్పై అభిశంసన.. : రిపబ్లికన్ల ఫైర్
భారత్ పట్ల చైనా బెదిరింపు యత్నాలను అడ్డుకుంటామని అమెరికా చెప్పింది. ఈ క్రమంలో అమెరికా మిత్రదేశాలు, భాగస్వామ్య పక్షాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తామని తెలిపింది. బైడెన్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై మాట్లాడడం ఇదే ఫస్ట్ టైమ్.
Also Read: జోబైడెన్ సంచలనం: ప్రతి అమెరికన్ కు లక్షన్నర
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. వాస్తవాధీన రేఖ వెంట సైనిక బలగాలను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. గల్వాన్ ఘటన తర్వాత ఉభయ దేశాల మధ్య పరిస్థితులు క్షీణించడంతో సైనిక బలగాలు నిత్యం అలర్ట్గా ఉంటున్నాయని చెప్పారు. ఇటీవల మరోసారి ఇరుదేశాల సైనికులు సరిహద్దుల్లో స్వల్ప స్థాయి ఘర్షణకు దిగారు. వీటన్నింటి నేపథ్యంలో అమెరికా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు