ప్రజాస్వామ్య అంటేనే చర్చ. ప్రతీ విషయంపై చర్చించి మెజారిటీ నిర్ణయానికి కట్టుబడడం. చట్టసభల్లో సభ్యులు చేయాల్సిన పని ఇదే. కానీ.. దురదృష్టవశాత్తూ భారతదేశంలో కొన్నేళ్లుగా జరుగుతున్నది వేరు. ప్రజాసమస్యలను ఎప్పుడో గాలికి వదిలేశాయనే అపవాదును మూటగట్టుకున్న రాజకీయ పార్టీలు.. రానురానూ మరింత విశృంఖలంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు.. తమకు నష్టం కలిగించే అంశాలపై చర్చకే అవకాశం ఇవ్వకపోతుండగా.. మరికొన్ని అంశాల్లో విపక్షాలు రాద్దాంతం చేయడమే పనిగాపెట్టుకుంటున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు పార్లమెంట్ లో నెలకొన్న తీరుమరోసారి దేశవ్యాప్త చర్చకు తెరతీసింది.
జూలై 19వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి పార్లమెంటులో ఒకే పరిస్థితి. విపక్షాలు పట్టుబట్టడం.. ప్రభుత్వం మొండి పట్టు పట్టుపట్టడం. సమావేశాలు మొదలైన నాటి నుంచీ ఇదే వరస. మొత్తంగా.. యమధర్మరాజు – సావిత్రి మధ్య జరిగిందని చెప్పే కథలాగా మారిపోయింది. దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్’ అంశంపై చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టు బడుతుండగా.. ‘అది ఒక్కటి దక్క’ అంటోంది కేంద్రం. అది పూర్తయిన తర్వాతనే.. మిగిలిన వాటిపై చర్చ అంటున్నాయి విపక్షాలు. ఈ మేరకు దేశంలోని 14 పార్టీలు జట్టుకట్టాయి. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచే వరకూ నిద్రపోయేది లేదంటున్నాయి. మరి, ఇంతకూ తప్పు ఎవరిది?
ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ సాఫ్ట్ వేర్ తో దేశంలోని విపక్ష నేతలు, జర్నలిస్టులు, సుప్రీం న్యాయమూర్తుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని కోరుతున్నప్పటికీ.. మోడీ నోరు మెదపట్లేదు. కనీసం.. విచారణ జరిపిస్తామని చెప్పాలని డిమాండ్ చేసినా.. విచారణకు సైతం సిద్ధం కావట్లేదు. ఇందులో ఏదీ చేయట్లేదంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిందనే భావించాల్సి వస్తోందని, కాబట్టి.. ఈ అంశంపై చర్చ జరిగి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
కేంద్రం మాత్రం ఆ ఒక్క అంశంపై తప్ప, మిగిలిన అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తోంది. తప్పు చేయనప్పుడు చర్చకు ఎందుకు వెనకాడుతున్నారన్నది విపక్షాల వాన. దీంతో.. విపక్షాలను కూల్ చేసేందుకు ఉపరాష్ట్రపతి రంగంలోకి దిగారు. విపక్ష నేతలతో చర్చించి, ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే.. పెగాసస్ పై చర్చకు సిద్ధమవ్వాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ స్తంభించిపోవడానికి కేంద్ర ప్రభుత్వం తీరే కారణమంటున్నాయి. సభలో రచ్చ జరగడానికి సిద్ధపడుతోంది తప్ప.. చర్చ జరగడానికి మాత్రం అంగీకరించట్లేదని అంటున్నాయి. ఏదిఏమైనా రెండు వర్గాలు పట్టుబట్టి కూర్చోవడంతో విలువైన సభాసమయం వృథా అవుతోంది.