Ayodhya Ram Temple : రాముడు వేరు.. రామ్‌ లల్లా వేరా.. దీని అర్థం ఏంటి? ఎందుకలా అంటారు.?

రాముడు, రాం లల్లా ఒక్కటేనా.. అయితే వేర్వేరుగా ఎందుకు పిలుస్తున్నారు. రామ్‌ లల్లా అంటే అర్థం ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Written By: NARESH, Updated On : January 6, 2024 8:21 pm
Follow us on

Ayodhya Ram Temple : దేశమంతా రామమయం అవుతోంది. మీడియా, సోషల్‌ మీడియా, ఆలయాలు, సమావేశాలు ఇలా ఎక్కడ చూసినా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాలపైనే వార్తలు, కథనాలు, చర్చలు జరుగుతున్నాయి. అయోధ్య రామమందిరంపై ప్రత్యేక కథనాలు ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌, సోషల్‌ మీడియాల్లో ప్రసారం అవుతున్నాయి. అనేక ప్రత్యేకతలను ఈ కథనాల ద్వారా ప్రజలు తెలుసుకుంటున్నారు. త్రేతాయుగంలో రాముడి పట్టాభిషేకం జరిగింది. అయితే దానిని ఎవరూ చూడలేదు. ఇప్పుడు అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష‍్ట మహోత్సవాన్ని శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అంత ఘనంగా నిర్వహించేందుకు తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు‍్ల చేస్తున్నారు. జనవరి 22, మధ్యాహ్నం 12:30 గంటలకు బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన అతిథులకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలను కూడా ట్రస్టు తరఫున పంపించారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. అయితే రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరాముడి వివిధ పేర్లతో సంబోధిస్తున్నారు. బాల రాముడు, రామ్‌ లల్లాగా మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో రాముడు, రాం లల్లా ఒక్కటేనా.. అయితే వేర్వేరుగా ఎందుకు పిలుస్తున్నారు. రామ్‌ లల్లా అంటే అర్థం ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రామ్‌ లల్లా అంటే బాల రాముడు.
తులసీదాస్‌ రచించిన రామచరిత మానస్‌లో బాల రాముడిని రామ్‌ లల్లాగా రచయిత అభివర్ణించారు. ఈ పేరు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా రామ్‌ లల్లా పేరును ఎక్కువగా వాడుతున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. దీనిని రామ్‌ లల్లాగా పిలుస్తున్నారు. ఇక ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే.. మనం చిన్నపిల్లలను చిన్ను, బుజ్జి, చిట్టి, కన్నా అని ముద్దుగా పిలిచినట్లుగానే అప్పట్లో అయోధ్యలో చిన్న పిల్లలను లల్లా అని పిలిచేవారట. ఐదారేళ్ల వరకు బాల రాముడిని కూడా అందరూ రామ్‌ లల్లా అని సంబోధించే వారని తులసీదాస్‌ తన రామచరి మానస్‌లో అభివర్ణించారు. అందుకే అయోధ్య రాముడిని కూడా రామ్‌ లల్లాగా పిలవబోతున్నారు.

వేడుకలకు ప్రముఖులు..
ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతోపాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు ప్రభాస్‌, అల్లు అర్జున్‌, సల్మాన్‌ ఖాన్‌, టైగర్‌ ష్రాఫ్‌ తదితరులు హాజరు కానున్నారు. నరేంద్ర మోదీ చేతుల మీదగా రామ్‌ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. కోట్లాది మంది భారతీయ హిందువల దశాబ్దాల కల జనవరి 22వ తేదీన నెరవేరబోతోంది. ఆ తేదీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.