Ayodhya donations missing case: కొద్దిరోజులుగా జాతీయ మీడియాలో.. ప్రాంతీయ మీడియాలో అయోధ్య రామాలయం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా అక్కడి ఆలయంలో భక్తులు ఇస్తున్న విరాళాలు దారి మళ్ళాయి అంటూ కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సెక్షన్లు అయోధ్య రామాలయం గురించి అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెడుతున్నాయి. వాస్తవానికి విరాళాలు మాయమైపోయాయా.. కొందరు వాటిని కావాలని దారి మళ్ళించారా.. ఆ డబ్బులను ఏం చేశారు.. వీటిపై యూపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ వ్యవహారం మీద తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు..”రామాలయం నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 500 సంవత్సరాలు ఎదురు చూసాం. ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. ఈ విరాళాలు మాయమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.. దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. నిరాధార ఆరోపణలు అసలు చేయకూడదు. ప్రత్యేక దర్యాప్తు బృందం మీద నాకు నమ్మకం ఉంది.. విరాళాలకు సంబంధించి అవకతవకలు గనక జరిగి ఉంటే కచ్చితంగా ఆ ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమర్పించాలని” యోగి పేర్కొన్నారు. “అనవసరమైన అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యవహరించకూడదని.. రామాలయ ప్రతిష్టను దెబ్బతీసి.. ట్రస్ట్ కార్యకలాపాలను ఇబ్బంది పెట్టకూడదని” యోగి పేర్కొన్నారు.
మరవైపు ఈ ఆలయ నిర్వహణ పట్ల రామజన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్.. మాజీ ఐఏఎస్ అధికారి మిశ్రా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు పక్క దారి పట్టడం ఏంటని మండిపడ్డారు. ఆలయ పరిపాలన విధానం సరిగా లేదని.. ఇది విధానాల బలహీనతను సూచిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల రకరకాల విమర్శలు వితమవుతున్నాయని.. ఇలాంటప్పుడు ఆలయ పరిపాలన మొత్తం ప్రక్షాళన కావాలని ఆయన సూచించారు. వాలంటీర్ల ద్వారా ఎక్కువ సేవల జరగడం వల్ల జవాబుదారితనం లోపిస్తోందని.. దానివల్ల ఆలయ ప్రతిష్ట మొత్తం మంటగలిసిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ నిర్మాణంలో ఎంతో వేగంగా పనిచేసిన ట్రస్ట్ బోర్డు.. ఆలయ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా కీలకమైన విభాగాలలో పనిచేయడానికి వాలంటీర్లను పెట్టుకుంది. వారికి వేతనం ఇవ్వకుండా.. కేవలం భోజనం మాత్రమే పెట్టవచ్చని నిర్వహణ బోర్డు కక్కుర్తి పడింది. దానివల్ల వాలంటీర్లు ఇలా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా రామాలయం ప్రతిష్ట మొత్తం మంట కలిసి పోతుంది. కీలకమైన విభాగాలలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను నియమించి.. వారికి జీతభత్యాలను అందిస్తే ఇటువంటి పరిస్థితి రాదని రామ భక్తులు అంటున్నారు. మరి దీనిపై ట్రస్ట్ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
