Audit bills signed with tiger : మన దేశంలో పాలన వ్యవస్థలన్నీ చూసేది ప్రభుత్వ యంత్రాంగం. దానిని పర్యవేక్షించేది బ్యూరోక్రసీ వ్యవస్థ. మధ్యలో రాజకీయ చొరబాట్లు అన్నది సహజం. పాలనలో మంచి చెడులు మాత్రం రాజకీయ పార్టీలు తలకెత్తుకుంటాయి. వీటికి సంబంధం లేకపోయినా అందులో లబ్ధిని, లోటుపాట్లను తమ మీద వేసుకొని ప్రచారం చేసుకుంటాయి. దశాబ్దాలుగా జరుగుతున్నది ఇదే. ఏపీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం మీ పాపమంటే మీ పాపమేనని జగన్, ఇటు చంద్రబాబు ఆడి పోసుకుంటారు. అదే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా సీఎం కేసీఆర్, విపక్షాల మధ్య జగడం నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ యంత్రాంగం డొల్లతనం మాత్రం ఎవరికీ కనిపించదు.
రాజకీయ పార్టీల కంటే ప్రభుత్వ శాఖల మధ్య కీచులాటలు జరుగుతుంటాయి. ముఖ్యంగా బ్యూరోక్రసీ వ్యవస్థలో తెలివితేటలు అన్నమాట ఒకటి చాలా ప్రభావం చూపుతుంది. అది పాలనపై పడి ప్రజోపయోగ పనుల్లో ఎడతెగని జాప్యానికి కారణమవుతుంది. కానీ యంత్రాంగం లోపాలు బయటపడవు. దానికి రాజకీయ ముసుగు తగిలించుకొని నేతలు కీచులాడుతుంటారు. అయితే అది ఒక ఏపీ, తెలంగాణలో కాదు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. బ్యూరోక్రసీ వ్యవస్థలో డొల్లతనం ఈ దేశానికి శాపంగా మారుతోంది.
శాఖల మధ్య ఆధిపత్య ధోరణికి, సమన్వయలోపానికి ఒక చిన్న ఉదాహరణ. కలకత్తా ఆలిండియో రేడియో స్టేషన్ వారు చాలా ఏళ్ల కిందట చిన్నపిల్లల ప్రయోజిత కార్యక్రమాన్ని రికార్డు చేస్తున్నారు. అందులో భాగంగా పులిగాండ్రింపులు వారికి అవసరమయ్యాయి. దీంతో జూ అధికారులను సంప్రదించారు. కార్యక్రమాన్ని రికార్డు చేస్తున్నారు. అయితే పులి ఎంతకీ గాండ్రించకపోవడంతో అప్పట్టో రెండున్నర అణాలతో మాంసం ముక్కలను వేసి పులికి వేయడంతో గాండ్రించింది. రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. అయితే కార్యక్రమ జమా ఖర్చులు ఆడిట్ శాఖ వద్దకు వెళ్లాయి. దీంతో వారు పులిపై పెట్టిన ఖర్చుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అయితే దీనిపై రేడియో స్టేషన్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు రికార్డింగ్ చేసినప్పుడు ఆర్టిస్ట్ ల కోసం అదనపు ఖర్చుపెట్టేందుకు డైరెక్టర్ కు వెసులబాటు ఉందని సమాధానమిచ్చారు. అయితే మీరు ఆర్టిస్ట్ గా పరిగణిస్తున్న పులితో ఓ సంతకం చేయించి పొందుపరచాలని ఆడిట్ శాఖ నుంచి రిప్లయ్ వచ్చింది. దీనికి డైరెక్టర్ నుంచి అది సాధరణ పులి అయితే అలానే చేసి ఉండేవారమని.. అది రాయల్ బెంగాల్ టైగర్ అని.. అసాధరణమైనదని.. అసాధరణ ఆర్టిస్టుల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఖర్చుపెట్టే వెసులబాటు ఉందని.. అది బెంగాల్ టైగర్ అని నిర్థారిస్తూ జూ అధికారుల ఇచ్చిన ధ్రువపత్రాన్ని ఆడిట్ శాఖ అధికారులకు పంపించారు. దీంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. మన దేశంలో ప్రభుత్వ యంత్రాంగం, బ్యూరోక్రసి వ్యవస్థలో ఉన్నడొల్లతనానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.