టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డె యిరీ కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న నరేంద్రకు హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు విముక్తి కలిగినట్లయింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఆయనకు హైకోర్టు బెయిలిచ్చింది. సంగం డెయిరీ అక్రమాల కేసులో గత నెల 23న చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణన్ ను ఏసీబీ అరెస్టు చేసింది.
అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మధ్యలో ఏసీబీ కస్టడీ విచారణతో పాటు పలు జైళ్లకు కూడా తిప్పారు. ఆరోగ్యం బాగా లేకపోయినా ఏసీబీ అధికారులు మాత్రం ఆస్పత్రి నుంచి జైలుకు కూడా తరలించారు. దీనిపై గతంలోనే ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ధూళిపాళ్లకు ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఆయన బె యిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.
ధూళిపాళ ఆరోగ్య పరిస్థితిని విచారణలోని అంశాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ కు కొన్ని షరతులు విధించింది. ఆయన నాలుగు వారాల పాటు విజయవాడలో ఉండాలని సూచించింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందవచ్చని పేర్కొంది. దీంతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. సంగం డె యిరీ కేసులో విచారణ కొనసాగనుంది.