Homeఆంధ్రప్రదేశ్‌పోలింగ్ కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి..

పోలింగ్ కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి..

AP Elections
ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే 100 మంది అభ్యర్థులు చనిపోయినట్లు అధికారిక లెక్కలు తేల్చడంతో రాజకీయ పార్టీలు గందరగోళంలో పడ్డాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సరిగ్గా 100మంది చనిపోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ శాఖ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. ఇక అభ్యర్థులు మరణించిన చోట తిరిగి నామినేషన్లు వేయడానికి ఈసీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 మార్చి నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేసిన తర్వాత, కరోనా వ్యాప్తి కారణంగా అకస్మాత్తుగా ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. ఇక అప్పటినుండి ఈ ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు ఇప్పటివరకు 100 మంది మృతి చెందినట్లుగా తాజా సమాచారం.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగాయి. రెండు ఎన్నికలు సజావుగా ముగిసాయి. దీంతో గత సంవత్సరం వాయిదాపడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇక పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై ఆరా తీసిన అధికారులు అప్పటినుండి ఇప్పటివరకు ఎంపీటీసీలుగా పోటీ చేసిన 87 మంది, జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన 13 మంది చనిపోయారని అధికారికంగా నిర్ధారించారు.

ఇక ఈ జాబితాలో ఎనిమిది మంది ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ ఏకగ్రీవమైన వారిలో ఉన్నారు. ఎన్నికల బరిలోకి దిగిన అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి నిలిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుందని తెలుస్తుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version