
సందర్భం ఏదయినా.. అది సంచలనమే.. రాజకీయాలు కావొచ్చు.. బైంసా అల్లర్లు కావచ్చు.. అసెంబ్లీ సమావేశాలు కావచ్చు.. సూర్యపేట కబడ్డీ పోటీలు కావచ్చు.. ఏది జరిగినా సరే ప్రజలంతా ఉత్కంఠ భరితంగా మునివేళ్లపై నిలుచునే పరిస్థితి ఉంది. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా.. ఉలిక్కి పడాల్సి వస్తోంది. ఎన్నికలకంటే.. ఉప ఎన్నికలే రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. పరువుకోసం ఆరాట పడుతున్నాయి. తమ బలాన్ని చాటేందుకు తహతహలాడుతున్నాయి. తాజాగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించాయి.
కేవలం మాటలతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే విద్యలో ఆరితేరిన బీజేపీ మాత్రం నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు వచ్చేసరికి గుంభనంగా ఉంటోంది. మాటలు రానట్లు వ్యవహరిస్తోంది. సైలెంట్ గా ఉండడం వల్ల తమ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ ఎలాంటి సంకేతాలు పంపిస్తోందంటే.. ఓటమిని ముందే ఒప్పుకున్నట్లుగా… ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలతో కారు నాగార్జున సాగర్ వైపు వేగంగా దూసుకెళుతోంది. అభ్యర్థి ఎవరైనా కావొచ్చు… అక్కడ గెలవడమే తరువాయి… ప్రత్యర్థుల ముందు బలాన్ని చాటడమొక్కటే.. మిగిలింది అన్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు వ్యవహరిస్తున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదంటే.. అభ్యర్థి దొరక్క పోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అధికార పార్టీ ఇంతవరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ తరఫున జానారెడ్డి ఖాయమయ్యారు. దుబ్బాక నుంచి దూకుడుగా వ్యవహరించిన బీజేపీ సాగర్ దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు నెమ్మదించింది. ఆ ఊపును తగ్గించుకుంది. అధికార పార్టీ ఎలాగూ బలమైన అభ్యర్థిని బరిలో దింపుతుంది.
కాంగ్రెస్ నుంచి జానారెడ్డి సైతం బలమైన అభ్యర్థి. ఇద్దరు ఉద్దండుల మధ్య పోటీని తట్టుకుని నిలబడేదెవరా..? అని బీజేపీ అన్వేషణ కొనసాగిస్తోంది. గెలుపు సంగతి తరువాత కనీసం ఓట్లు చీల్చి రెండోస్థానం అయినా దక్కించుకోవాలని, లేకుంటే బీజేపీ పని అయిపోయినట్లేనని ప్రత్యర్థులు ప్రచారం చేస్తారేమోనన్న భయం కూడా వెంటాడుతోంది. జానారెడ్డి ఇక్కడి నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. ఈసారి గెలవాలంటే చెమటోడ్చక తప్పదు. ఈ పరిస్థితులను ఎలా సద్వినియోగం చేసుకోవాలా? అనే యోచనలో బీజేపీ ఉంది.