ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేశారు. ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై అనంతర పరిణామాలపై చర్చించారు. మే 3వ తేదీ లాక్డౌన్ ఉపసంహరణ, తర్వాత అనుసరించిన వ్యూహాలపై కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ హోం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో అనుమానితులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి మిలియన్ జనాభాకు 1,274 మందికి పరీక్షలు నిర్వహించిన దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్న అమిత్ షాకు వివరించారు.
మరోవైపు గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కోవిడ్–19 నివారణా చర్యలకోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి జగన్ ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అంశాన్ని సీనియర్ అధికారి సతీష్ చంద్ర చూసుకుంటారంటూ కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక అధికారిని అప్పగించారని తెలిపారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి తెలుగు మత్స్యకారులను గుజరాత్ నుంచి ఏపీకి తీసుకువచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తానంటూ నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారని చెప్పారు. సముద్రమార్గం ద్వారా తీసుకురావడానికి ప్రయాణికుల నౌకకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి, సంబంధిత విభాగాల నుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉందని, దీనికి చాలా సమయం పడుతుందని అధికారులు నివేదించిన నేపథ్యంలో ఈ ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.