Adani vs Ambani : ఓడలు బండ్లవుతాయి. బండలు ఓడలవుతాయి. ఇప్పుడు భారత సంపన్నుల విషయంలో ఈ సామెత నిజమవుతోంది. రకరకాల స్పెక్యూలేషన్లతో కేవలం గంటల వ్యవధిలో కొందరి సంపద ఆవిరవుతోంది. మరికొందరి సంపద అమాంతం పెరుగుతోంది. ఉదాహరణకు గౌతమ్ ఆదానీని తీసుకుంటే హిండెన్బర్గ్ నివేదికకు ముందు ఇండియాలోన కాదు, ప్రపంచంలోనూ అతడికి తిరుగు లేదు. హిండెన్బర్గ్ నివేదికతో ఒక్కసారిగా ఆయన కంపెనీల్లో ఆటుపోట్లు మొదలయ్యాయి. భారీగా సంపద కరిగిపోయింది. ఫలితంగా అంబానీని మించిపోయిన ఆయన.. తర్వాత అంబానీ కిందకు రావాల్సి వచ్చింది.
తిరగరాస్తున్నాయి
స్టాక్ మార్కెట్ ఆటుపోట్లు సంపన్నుల జాతకాలనూ తిరగ రాస్తున్నాయి. మార్కెట్ మాయాజాలంతో నిన్న మొన్నటి వరకు 8,100 కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఇప్పుడు ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. హిండెన్బర్గ్ నివేదిక పుణ్యమాని గత నెలన్నర రోజుల్లో అదానీ ఆస్తుల విలువ 60 శాతం తగ్గింది. దీంతో ఆయన ఆస్తుల విలువ 5,300 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.35 లక్షల కోట్లు) పడిపోయింది. హురున్ ఇండియా, ఎం3ఎం ఇండియా సంయుక్తంగా ‘ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ -2023’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయం తెలిపింది. గత ఏడాది కాలంలో అదానీ సంపద వారానికి సగటున రూ.3,000 కోట్ల చొప్పు న తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది.
మళ్లీ టాప్-10లో అంబానీ
ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 20 శాతం తగ్గింది. ఈ నెల 15 నాటికి ఆయన ఆస్తుల విలువ 8,200 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.76 లక్షల కోట్లు) చేరింది. అయినా అత్యంత సంపన్న భారతీయుడిగా ‘ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ జాబితాలో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానం సంపాదించారు. స్టాక్ మార్కెట్ ఆటుపోట్లతో ప్రస్తుతం వీరిద్దరి సంపద కొద్దిగా తరిగినా, పదేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం ఇద్దరి సంపద బారీగా పెరిగింది. అదానీ సంపద 1,225 శాతం పెరిగితే అంబానీ సంపద 356 శాతం పెరిగిందని హురున్ ఇంటర్నేషనల్ నివేదిక తెలిపింది.