పీకే.. ప్రశాంత్ కిషోర్.. ఈ పేరు తెలియని రాజకీయ నాయకుడు ఉండరేమో. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఆయన రావాల్సిందే. ఆయనను వాడాల్సిందే. అంతటి రాజకీయ చతురద ఆయనది. ఏ ఎన్నికల్లో అయినా ఆయన వ్యూహరచన చేశారంటే ఆ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందే. అంతటి పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడంలో ధిట్ట. ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే బీహార్కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ఆ తర్వాత పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ బిజీగా మారనున్నాడు.
2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఫైనల్గా ఆ పార్టీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగింది. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వన్ సైడ్ విజయం నమోదు చేసుకుంది.
ఇక ఇప్పుడు అన్ని పార్టీల చూపు ప్రశాంత్ కిషోర్పై పడింది. తమిళనాడులో ఇప్పటికే డీఎంకే ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడేళ్లు ఉన్నప్పటికీ కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అధినేత కుమారస్వామి కూడా ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలనుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. మమత బెనర్జీతో ఆయన టీం ఇప్పటికే కనెక్ట్ అయి సేవలందిస్తోంది. ఇక ప్రశాంత్ కిషోర్ తాజాగా పంజాబ్లోనూ జాతీయ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారట. పంజాబ్లో మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిర్ణయించారట. అంటే.. పీకే పంజాబ్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారన్నమాట.