ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశమైంది. ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తూ.. రాజధాని కాబూల్ ను సైతం హస్తగతం చేసుకున్నారు. దేశాధ్యక్షుడే దేశం విడిచిపారిపోవడంతో.. ఇక, అక్కడి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశం విడిచిపోయేందుకు విమానం రెక్కల మీద ప్రయాణించి, కొందరు జారిపడిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలోనే ఆప్ఘన్ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టు రణరంగంగా మారింది. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో.. ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ మూతపడింది. ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. ఆ దేశంలో చిక్కుకుపోయిన విదేశీయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్కడి నుంచి బయటపడే మార్గం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రాకపోకలు సాగించే విమానాలన్నీ దారిమళ్లాయి. అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియా వచ్చే విమానాలు.. గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీంతో.. ఆఫ్ఘన్ లో చిక్కుకున్న వారికి ఇండియా వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఈ క్రమంలో.. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ భారతీయుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది. గురు నాయక్ అనే వ్యక్తి ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నేను రెండు విమానాలకు టికెట్లు బుక్ చేశాను. కానీ.. రాకపోకలు నిషేధించడంతో రెండు టిక్కెట్లూ రద్దయ్యాయి. దీంతో.. నిన్న రాత్రి కాబూల్ విమానాశ్రయం దగ్గర్లోని ఓ హోటల్ లో పడుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు’’ అంటూ ఆ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మిగిలిన దేశాలకు చెందిన వారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఆయా దేశాలు తమ పౌరులను తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ.. విమాన రాకపోకలు రద్దవడంతో ఇబ్బందిగా మారింది. భారత్ సైతం ఇండియన్స్ ను తరలించేందుకు గడిచిన రెండు రోజులపాటు ప్రత్యేక విమానాలను నడిపింది. అయినప్పటికీ.. ఇంకా చాలా మంది అక్కడే ఉండిపోయారు. మరి, విమానాల రాకపోకలు ఎప్పుడు మొదలవుతాయో? మిగిలిన వారు ఎప్పుడు స్వదేశం చేరుతారో తెలియకుండా ఉంది.