Air India Express: కొత్త ఓటర్లకు ఎయిరిండియా అదిరిపోయే ఆఫర్‌..!

కార్పొరేట్‌ ప్రోత్సాహంలో భాగంగా ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల టికెట్‌ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 3:43 pm

Air India Express

Follow us on

Air India Express: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్తగా ఓటుహక్కు వినియోగించుకునే యువ ఓటర్లకు కార్పొరేట్‌ సంస్థలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. పోలింగ్‌ శాతం పెంపే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు యువ ఓటర్లను ప్రోత్సహిస్తున్నాయి.

ఎయిర్‌ ఇండియా ర్యాలీ..
కార్పొరేట్‌ ప్రోత్సాహంలో భాగంగా ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల టికెట్‌ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ పొందాలనుకునే వారు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది.

ఆఫర్‌ ఎప్పటి వరికంటే..
ఇక ఈ ఆఫర్‌ పరిమిత కాలం. ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 1 వరకు అమలులో ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరుగనున్న నేపథ్యంలో జూన్‌ 1 వరకు ఆఫర్‌ అమలులో ఉంటుందని తెలిపింది. టికెట్‌ బుకింగ్‌ సమయంలో మొబైల్‌ యాప్, కంపెనీ వెబ్‌సైట్‌ను వినియోగించాలి. ఈ ఆఫర్‌ను పొందే ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో బోర్డింగ్‌ కార్డ్‌లను సేకరించేటప్పుడు గ్రౌండ్‌ సిబ్బందికి తమ ఓటర్‌ ఐడీ కార్డు చూపించాలి. ఇక ఓటరు ప్రయాణించే ఎయిర్‌పోర్టు నియోజకవర్గానికి దగ్గరగా ఉండాలి. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ భారతదేశంలోని 31 గమ్యస్థానాలకు తమ సర్వీసులను నడుపుతోంది.

సంస్థ వార్సికోత్సవం సందర్భంగా..
ఎయిర్‌ ఇండియా సంస్థ 19వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా, ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అంకుర్‌గార్గ్‌ తెలిపారు. దేశ భవిష్యత్‌ను నిర్మించడంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ఎయిర్‌ ఇండియా ముందుకు వచ్చిందని వెల్లడించారు.