Homeజాతీయ వార్తలుPrajwal Revanna : మానభంగం.. మీడియా విశృంఖలత్వం.. సమాజం ఛీత్కారం.. ప్రజ్వల్ రేవణ్ణ చేతిలో బలైన...

Prajwal Revanna : మానభంగం.. మీడియా విశృంఖలత్వం.. సమాజం ఛీత్కారం.. ప్రజ్వల్ రేవణ్ణ చేతిలో బలైన మహిళల కన్నీటి కథ

Prajwal Revanna : అత్యాచారం జరిగితే బాధిత మహిళ పేరు రాయకూడదు. ఆమెను ఐడెంటిఫై చేసేలాగా వివరాలు కూడా ప్రచురించకూడదు. నిర్భయ కేసులో మీడియాకు సుప్రీంకోర్టు విధించిన గైడ్ లైన్స్ ఇవి. దురదృష్టవశాత్తు ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారంలో బాధిత మహిళల విషయంలో మీడియా వాటన్నిటిని గాలికి వదిలేసింది. కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసం ఆ వీడియోలను మార్చి మార్చి టెలికాస్ట్ చేసింది. దీంతో వారి ముఖాలు బయటికి కనిపించడంతో.. ఆ బాధిత మహిళలు ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు. ఆయిన వాళ్లకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. హసన్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రాజకీయ నాయకులు బాధిత మహిళల పేర్లు తెలిసే విధంగా మాట్లాడటంతో.. వారంతా ముఖం చూపించలేక వెళ్లిపోయారు.

హసన్ పార్లమెంట్ పరిధిలోని ఓ జడ్పిటిసి స్థాయి మహిళా ప్రజా ప్రతినిధి ప్రజ్వల్ చేతిలో మూడేళ్లుగా అత్యాచారానికి గురవుతూనే ఉంది. ఆమెను అత్యాచారం చేస్తున్నప్పుడు కెమెరాలో రికార్డు చేయడం.. ఆ దృశ్యాలను పెన్ డ్రైవ్ లో భద్రపరచడం.. ఆమె పడక సుఖం ఇవ్వనని మొండికేసినప్పుడు ఆ దృశ్యాలను చూపించి బెదిరించడంతో ఆమె గత్యంతరం లేక అతడు చెప్పినట్టలా చేసింది.. ఈ మహిళా ప్రజా ప్రతినిధికి సంబంధించిన వీడియోలను న్యూస్ చానల్స్ పదేపదే చూపించడంతో.. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఆచూకీ భర్తకు కూడా తెలియదట. పైగా ఆమెకు ఈడు వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారట. ఇలాంటి స్థితిలో పోయిన ఆమె ఆత్మగౌరవం ఎవరు తీసుకొస్తారు? ఒకప్పటిలాగా ఆమె తన కుటుంబంతో జీవించగలదా? ఈడు వచ్చిన అమ్మాయిల పరిస్థితి ఏమిటి? ఇలా కేవలం ఆ మహిళా ప్రజా ప్రతినిధి పరిస్థితి మాత్రమే కాదు.. అతడి చేతిలో వంచనకు గురైన వందలాది మంది మహిళల దుస్థితి అలానే ఉంది.

హై ప్రొఫైల్ రాసలీల వ్యవహారాలు తమ దృష్టికి వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు వివరాలు బయటకు పొక్కకుండా చూడాలి. కేవలం బాధితుల పక్షంలోనే వార్తలు ఉండాలి. కానీ, కర్ణాటకలో టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియా అడ్డదారులు తొక్కింది. కనీసం బాధిత మహిళల ముఖాలు కూడా బ్లర్ చేయాలనే సోయి లేకుండా పోయింది. ఏప్రిల్ 26 నుంచి ఇప్పటివరకు ఆ దృశ్యాలను చూపిస్తూనే ఉంది. ఇలాంటప్పుడు ఆ బాధిత మహిళలు ఎలా ముఖం చూపించగలరు.. “ప్రజ్వల్ చేతిలో మోసపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ మీడియా ప్రతినిధులు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. బాధిత మహిళల ఇళ్ల ఫోటోలను చూపిస్తున్నారు. ప్రజ్వల్ చేతిలో వంచనకు గురి కావడం ఎంత బాధ కలిగిస్తుందో తెలియదు కానీ.. మీడియా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. ఇక రాజకీయ నాయకుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదని” పేరు రాసేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి వాపోయారు. ప్రజ్వల్ ఉదంతం తర్వాత బాధిత మహిళల కుటుంబాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version