తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవాలంటే.. అఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవడమే ఏకైక మార్గం అని భావించే ఆఫ్ఘన్ల సంఖ్య అసాధారణంగా పెరుగుతోంది. దేశం విడిచి వెళ్లేందుకోసం కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి వారిని నిరోధించేందుకు తాలిబన్లు కాల్పులు కూడా జరుపుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. వారి కంటపడకుండా భారీగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. అయితే.. తాజాగా ఎయిర్ పోర్టు వద్ద జరిగిన దారుణంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఇంకా అమెరికా బలగాల ఆధీనంలోనే ఉంది. తాలిబన్లతో ఒప్పందం ప్రకారం.. ఈ నెల 31 వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను ఖాళీ చేయాల్సి ఉంది. అందువల్ల ఈ ఎయిర్ పోర్టు యూఎస్ సైన్యం చేతిలోనే ఉంది. అందుకే.. రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. ఆయా దేశాలకు చెందిన విమానాలు తమ పౌరులను తీసుకెళ్లేందుకు విమానాలు వచ్చి వెళ్తున్నాయి. భారత్ రెండు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా దాదాపు 160 మంది వరకు భారతీయులను స్వదేశానికి తరలించింది. యుద్ధం విమానాల ద్వారా కూడా భారతీయులను తరలిస్తున్నారు.
అయితే.. ఆఫ్ఘన్ నుంచి నేరుగా భారత్ కు విమానాలు చేరుకోవట్లేదు. అలా వచ్చి వెళ్తే ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో.. ఆఫ్ఘన్ లో భారతీయులను ఎక్కించుకుంటున్న విమానాలు.. చుట్టుపక్కల దేశాల్లో దించి, మళ్లీ వెళ్లి అక్కడి వారిని తరలిస్తున్నాయి. ముందుగా ఆఫ్ఘన్ నుంచి బయటకు తీసుకొస్తే సరిపోతుందని, ఆ తర్వాత ఆయా ప్రాంతాల నుంచి మెల్లగా ఇండియాకు తరలించవచ్చన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నట్టు సమాచారం.
అయితే.. ఈ సమయంలోనే ఏదో ఒక విమానం పట్టుకొని ఏదో ఒక దేశం పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘన్ పౌరుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకోసం ఎయిర్ పోర్టుకు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాబూల్ ఎయిర్ పోర్టులో భారీగా తొక్కిసలాట జరిగింది. రెండు గేట్లను మూసేయడంతో.. మూడో గేటు వద్దకు జనం మొతత్ం ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో.. ఘోరం జరిగిపోయింది. ఈ తొక్కిసలాటలో కిందపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.