హైదరాబాద్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణలో తాజాగా నమోదవుతున్న కేసులలో మూడొంతులు నగరంలోనే ఉంటున్నాయి.
ఒక వంక రాష్ట్రంలో కేసుల సంఖ్యా 800 ను మించి పోగా, నగరంలో పేరొందిన ని నీలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 200 మంది సిబ్బందిని క్వారంటైన్కు వెళ్లాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతున్నది.
దేశం మొత్తంలో ఒక ఆసుపత్రిలో ఇంతమంది సిబ్బందిని ఒకేసారి క్వారంటైన్కు పంపిన దాఖలాలు లేవని చెప్పాలి. ఆసుపత్రిలో చికిత్స పొందిన 45 రోజుల బాలుడికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 15, 16, 17 తేదీల్లో ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరిని క్వారంటైన్కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
నారాయణపేట్ జిల్లా అభంగాపూర్కు చెందిన మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక నలభై ఐదు రోజుల వయసున్న చిన్నారికి జ్వరంరావడంతో అతని తండ్రి స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు.
ఆ తర్వాత మహబూబ్నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చిన్నారి నుంచి సేకరించి శాంపిల్స్తో కరోనా పాజిటివ్ అని తేలడంతో సూపరింటెండెంట్ ఈ ఆదేశాలు జారీచేశారు. అలాగే చిన్నారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్కు తరలించారు.