TSPSC Paper Leak: తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం దారితప్పుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. ఇస్పటికే 15 మందిని సిట్ అరెస్ట్ చేసింది. లీకేజీకి ప్రధాన సూత్రధారులు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి, రేణుక, డాక్యానాయక్ అని గుర్తించింది. విచారణలో భాగంగా బోర్డు సెక్రెటరీ, సభ్యులతోపాటు చైర్మన్ను కూడా విచారణ చేసింది. అయితే ఈ విచారణలో ఏ2 రాజశేఖర్ సొంత మండలంలో 40 మంది గ్రూప్–1 ప్రిలిమ్స్లో 100కుపైగా మార్కులు సాధించినట్లు సిట్ గుర్తించింది.
నిజమవుతున్న విపక్షాల ఆరోపణలు..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన కేటీఆర్ పీఏ తిరుపతి పేపర్ లీకేజీలో కీలక పాత్ర పోషించాడని, కేటీఆర్ ఆదేశాలతోనే అలా చేశాడని బీజేపీ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. తాటిపల్లి మండలంలో 100 మందికిపైగా గ్రూప్–1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు వచ్చాయని పేర్కొంటున్నారు. కేటీఆర్ను విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయని డిమాండ్ చేస్తున్నారు. కానీ, సిట్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వకుండా విపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. కానీ ఇప్పుడు విపక్షాల మాటే నిజమౌతోంది. సిట్ విచారణలో మల్యాల మండలంలోనే 40 మందికి వందకు పైగా మార్కులు వచ్చినట్లు తాజాగా గుర్తించింది.
కేటీర్కు సమాచారం..
ఇక తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండించారు. తన పీఏ తిరుపతిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లెక్కలతో సహా వెల్లడించారు. మల్యాల మండలంలో కేవలం 30 మంది గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వాలీఫై అయ్యారని, జగిత్యాల జిల్లా మొత్తంలో ఒకే ఒక్కడు వందకుపైగా మార్కులు సాధించడని వెల్లడించారు. ఈ సమాచారం అధికారికంగా తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. తానే పేపర్ లీక్ చేయిస్తే సిరిసిల్ల జిల్లాలో అందరికీ ఇస్తా కదా అని ఎదురు ప్రశ్నించారు. లీకేజీపై సిట్ విచారణ జరుపుతుండగా కేటీఆర్కు గ్రూప్–1 అభ్యర్థుల వివరాలు ఎవరిచ్చారనేది ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఆ సమాచారం కూడా తప్పని సిట్ నిర్ధారించింది. మల్యాల మండలంలోనే 40 మందికి వంద మార్కులకుపైగా వచ్చినట్లు గుర్తించింది.
కేటీఆర్ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో..
తాను చెప్పేది అధికారిక సమాచారం అని కాగితాలు చూపుతూ జగిత్యాల జిల్లాలో ఒకే ఒక్కడు 100 మార్కులకుపైగా సాధించాడని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు తలల ఎక్కడ పెట్టుకుంటారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరే ఉన్నారన్న విచారణను మూసివేయించేలా కేటీఆర్ ప్రయత్నించారని పేర్కొన్నారు. సిట్ ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిందని పేర్కొంటున్నారు. తాజాగా మల్యాల మండలంలోనే 40 మందికి 100 మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో కేటీఆర్ను విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లీకేజీలో కీలక పాత్ర కేటీఆర్, ఆయన కుటుంబానిదే అని పునరుద్ఘాటిస్తున్నారు.
మరి సిట్ అధికారులు కేటీఆర్కుగానీ, ఆయన పీఏ, మల్యాల మండలానికి చెందిన తిరుపతికిగానీ కనీసం నోటీసులు ఇచ్చే సాహసం చేస్తారో లేదో చూడాలి.