Monsoon Leafy Vegetables: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా మంది ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఆకుకూరలు తినడానికి భయపడుతుంటారు. ఎందుకంటే వర్షాకాలంలో ఆకుకూరలు తింటే విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరల వల్ల కాదు, వాటిని శుభ్రంగా కడగకుండా వండుకుని తినడం వల్లే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు వర్షాకాలంలో ఆకు కూరలు తినొచ్చా?
ఆకుకూరలు శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్, కాల్షియం, ఫైబర్, విటమిన్ A, C, K వంటి పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.
అయితే వర్షాకాలంలో ఆకుకూరలు తినడం వల్లే డయేరియా వస్తుందని కొందరి అపోహ మాత్రమే. నిజానికి కలుషితమైన ఆకుకూరలు లేదా శుభ్రం చేయని ఆహారం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు లేదా పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే విరేచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య ఆకుకూరల్లో కాదు, వాటి పరిశుభ్రతలోనే ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే వాటిని శుభ్రపరచడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చెబుతున్నారు. సాధారణంగా ఆకు కూరలు పొలాల్లో మట్టి, బురద వంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ముఖ్యంగా పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర వంటి ఆకుకూరల ఆకులపై మట్టి, దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుల గుడ్లు, కీటకాలు అంటుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటిని శుభ్రం చేయకుండా వండితే బ్యాక్టీరియా, పరాన్నజీవులు శరీరంలోకి చేరి జీర్ణాశయ సమస్యలు కలిగించవచ్చు.
ఆకుకూరలను ముందుగా పసుపు రంగు లేదా పాడైన ఆకులను తొలగించాలి. తర్వాత ఒక పాత్రలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ వేసి ఆకుకూరలను సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి. దీంతో ఆకులపై ఉండే మట్టి, చిన్న కీటకాలు, కొన్ని సూక్ష్మజీవులు తొలగిపోవడానికి సహాయపడుతుంది. అనంతరం శుభ్రమైన నీటితో రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి వండుకోవాలి.
పోషకాహార నిపుణుల సూచన ప్రకారం ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు సుమారు 50 గ్రాముల ఆకుకూరలు ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే ఒక్క రకమైన ఆకుకూర మాత్రమే కాకుండా వారంలో వివిధ రకాల ఆకుకూరలను మారుస్తూ తీసుకోవడం మంచిది. దీంతో శరీరానికి విభిన్న రకాల పోషకాలు అందుతాయి.
చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఆకుకూరలను తప్పనిసరిగా బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకునే ఆకుకూరల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయట విక్రయించే శుభ్రత లేని ఆకుకూరలను కొనుగోలు చేయకుండా తాజా, నాణ్యమైన వాటినే ఎంచుకోవాలి.
