Heat Stroke Risk At Home Causes: ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే తక్కువ నమోదు కావడం లేదు. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితి అయితే ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నప్పటికీ వడదెబ్బ (హీట్ స్ట్రోక్) తగిలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డీహైడ్రేషన్, అధిక ఉష్ణోగ్రతలు, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యకు గురి కావచ్చు. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే చర్మం పొడిగా మారడం.. తలనొప్పి, వాంతులు వంటివి ఏర్పడుతాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇంట్లో ఉండగా వడదెబ్బకు ఎలా గురవుతారు?
వాతావరణం వేడిగా ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్ లేదా AC లేకుండా ఎండలో కూర్చోవడం.. తక్కువ నీరు తాగడం.. టీ-కాఫీ-మద్యం ఎక్కువ తాగడం వల్ల డీహైడ్రేషన్ వచ్చి వడదెబ్బ తగులుతుంది. పెద్దలు, పిల్లలు, గర్భిణులు, గుండె సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారికి ఇంట్లోనూ వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. గది వేడెక్కి 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అలాగే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకపోయినా, ఇంటి వెంటిలేషన్ తక్కువగా ఉంటే సమస్య ఈ సమస్యకు గురి కావొచ్చు.
ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బకు గురైన వారిలో తీవ్ర తలనొప్పి .. తల, చర్మం వేడెక్కి పొడిగా మారడం, జ్వరం, వాంతులు, అలసట, కళ్లు తిరగడం, గందరగోళం వంటివి లక్షణాలు ఉంటాయి . ఇవి తీవ్రమైతే ఫిట్స్, స్పృహ కోల్పోవడం, గుండె మంట, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. పిల్లల్లో ఆకలి లేకపోవడం, బిగుసుకోవడం మొదలైతే వెంటనే అప్రమత్తం కావాలి.
వెంటనే చల్లని గదికి తరలించి, తడి దుస్తులు వేసి, ఫ్యాన్ గాలి వచ్చే ప్రదేశంలో కూర్చోబెట్టాలి. ORS వంటి చల్లనీ పానీయాలు తీసుకోవాలి. 15 నుంచి 30 నిమిషాల వరకు ఇలాంటి పరిస్థితి ఉంటే వెంటనే డాక్టర్కు చూపించాలి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రోజుకు 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగాలి.
పిల్లలు వడదెబ్బ (హీట్ స్ట్రోక్)కు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అంతేకాకుండా వీరి చర్మం సున్నితంగా ఉండటంతో నీరు త్వరగా ఆవిరవుతుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్, చెమట త్వరగా పడటం వల్ల ఇది తగలొచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు రోజుకు తమ వయస్సు, బరువు అనుగుణంగా 1-2 లీటర్లు నీరు తాగించాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం ఇస్తూ ఉండాలి. దాహం వచ్చినా లేకున్నా క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఇంట్లో చల్లని గదిలో ఉంచి, ఫ్యాన్ లేదా ACలో ఉంచండి. ప్రతిరోజూ 2 నుంచి 3సార్లు స్నానం చేయించడం మంచిది.