Homeఆంధ్రప్రదేశ్‌న్యాయవ్యవస్థతో జగన్ ఢీ.. మతలబేంటి? ఏం జరుగనుంది?

న్యాయవ్యవస్థతో జగన్ ఢీ.. మతలబేంటి? ఏం జరుగనుంది?

దేశంలోనే ఎవరూ చేయని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేస్తున్నారు. ఏకంగా న్యాయవ్యవస్థతోనే డైరెక్టుగా ఢీకొంటున్నారు. ఇన్నాళ్లు ముసుగులో గుద్దులాటలాగానే తెరవెనుక ఉండి చర్యలు చేపడుతూ మౌనం దాల్చిన జగన్ ఇప్పుడు డైరెక్టుగా ఓ సుప్రీం కోర్టు జడ్జిపై ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాయడం రాజకీయ, న్యాయ, దేశ రాజకీయాల్లో పెను సంచలనమైంది. ఇలా న్యాయవ్యవస్థతో ఇంత డేరింగ్ గా ఒక ముఖ్యమంత్రి ఢీకొనడం ఇప్పటివరకు దేశంలో జరగలేదు.

Also Read: హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు..?

ఏపీ సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన పథకాలపై హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చివరకు రాజధాని అంశంలోనూ హైకోర్టులో చుక్కెదురైంది. మిగితా స్కీంల మీద ఎవరో ఒకరు హైకోర్టులో పిల్‌ వేయడం.. హైకోర్టు బ్రేక్‌ లు వేయడం చూస్తూనే ఉన్నాం. ఇక విసిగిపోయిన జగన్‌ సర్కార్‌‌ ఏకంగా జడ్జీలపైనే న్యాయపోరాటానికి సిద్ధమవ్వడం సంచలనమైంది..

అమరావతి భూ కుంభకోణం, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులకు సంబంధించి ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం శనివారం రాత్రి విజయవాడలో కీలక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని చానళ్లలో వస్తున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి జస్టిస్‌ సోమయాజులు స్టే ఇచ్చారని అజేయ కల్లాం తెలిపారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ కేసులో రాష్ట్ర హైకోర్టు ఏకంగా గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు.

అంతేకాదు.. ఈ కేసులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచనలతో సుప్రీం కోర్టు ఓ సీనియర్‌‌ జడ్జి జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అజయ్ కల్లాం సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు ఫిర్యాదు చేసినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 8న అందించినట్లు వెల్లడించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఆ జడ్జిని అడ్డుపెట్టుకొనే చంద్రబాబు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఇందుకు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించిందని, ఆ వెంటనే ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు.

చంద్రబాబు సుప్రీం కోర్టు జడ్జితో కలిసి ఇదంతా ఆడిస్తున్నారని అజయ్ కల్లం ఆరోపించారు. అంతేకాదు.. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కూడా సుప్రీం జడ్జి ప్రభావితం చేస్తున్నారంటూ కల్లాం మాటలు కల్లోలమే సృష్టించింది. ఆయన సూచనలతోనే హైకోర్టులో పరిణామాలన్నీ మారిపోతున్నాయని ఆరోపించారు..

Also Read: ఏపీలోని ఆ జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్..?

ఏపీ ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే ఆరోపణలు చేయడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ వివరాలు కూడా బయటకు వచ్చాయి. అందులో వివరాలు కూడా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ పక్కా ఆధారాలతోనే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. జగన్ రాసిన లేఖలో టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం, విశాఖపట్నంలో టిడిపి చీఫ్ అరెస్టుకు సంబంధించి కోర్టుకు పిలవడం ద్వారా పోలీసు ఉన్నతాధికారులను అవమానించారని.. ఇలా అపహాస్యం చేయడం ద్వారా తన ప్రభుత్వంపై  తనపై వ్యక్తిగతంగా కక్ష సాధించారని ఏపీ హైకోర్టుపై జగన్ అభియోగాలు మోపినట్టు సమాచారం. కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వైయస్ఆర్సి ఎమ్మెల్యేలపై పిటిషన్లు వేయించారని జగన్ పేర్కొన్నట్టు తెలిసింది.  సుప్రీం జడ్జి టిడిపికి అనుకూలంగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ లేఖలో అభ్యర్థించినట్టు సమాచారం.

దీన్ని బట్టి సీఎం జగన్ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించాడని అర్థమవుతోంది.  దేశంలోనే ఎంతో పవర్ ఫుల్ అయిన న్యాయవ్యవస్థతో ఢీకొంటున్న సీఎం జగన్ దాని పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడని స్పష్టమవుతోంది. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకునే ముందు కేంద్రంలో ఉన్న పెద్దలను జగన్ కలిసి వచ్చాడు. ప్రధాని మోడీతో భేటి అయ్యారు. ఆ తరువాతే న్యాయవ్యవస్థతో ఢీకొంటున్నారు. మోడీ, అమిత్ షాలు భరోసా కల్పించడంతోనే జగన్ ఈ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలోని పెద్దల నిర్ణయం ప్రకారమే దీన్ని లీక్ చేశారని అర్థమవుతోంది. మరి ఈ యుద్ధంలో  ఏం జరుగుతుందనే వేచి చూద్దాం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version