Uday Kiran : ఉదయ్ కిరణ్ సిస్టర్ శ్రీదేవి చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటైన నువ్వు నేను రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘చిత్రం’ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఉదయ్ కిరణ్ ని దర్శకుడు తేజ హీరో చేశాడు. చిత్రం సూపర్ హిట్ కావడంతో రెండో సినిమాలో కూడా దర్శకుడు తేజ రిపీట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ అయిన తేజ చిత్రం తో దర్శకుడు అయ్యాడు.
ఆయన రెండో చిత్రం నువ్వు నేను. ఉదయ్ కిరణ్ కి జంటగా అనితను తీసుకున్నారు. 2001లో విడుదలైన నువ్వు నేను ఇండస్ట్రీని షేక్ చేసింది. చిన్న చిత్రాల్లో అతిపెద్ద విజయం సాధించింది. కామెడీ, రొమాన్స్, లవ్, ఎమోషన్, సాంగ్స్ అన్నీ వర్క్ అవుట్ అయ్యాయి. ఆర్పీ పట్నాయక్ పాటలు యూత్ కి తెగ నచ్చాయి. నువ్వు నేను చిత్రంలోని ‘గాజువాక పిల్లా మేము గాజులోళ్ళం కాదా” అప్పట్లో సెన్సేషన్. ఉదయ్ కిరణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది నువ్వు నేను.
హీరోయిన్ అనిత సైతం వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ మూవీ దాదాపు 23 ఏళ్ల తర్వాత రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి 21న నువ్వు నేను థియేటర్స్ లోకి వస్తుండగా ఉదయ్ కిరణ్ సిస్టర్ శ్రీదేవి మీడియా ముందుకు వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. నువ్వు నేను సినిమా మా అందరికీ చాలా ప్రత్యేకం. ఈ సినిమాకు గాను ఉదయ్ కిరణ్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే మన నుండి దూరం అయిన ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, తెలంగాణ శకుంతల వంటి లెజెండ్స్ ని మరలా గుర్తు చేసుకున్నట్లు అవుతుంది.
నువ్వు నేను చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే దర్శకుడు తేజకు కృతజ్ఞతలు అని.. అన్నారు. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అనూహ్యంగా కన్నుమూశారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వీడారు. ఒకప్పుడు వైభవం చూసిన ఉదయ్ కిరణ్ కి అవకాశాలు రాకపోవడం కృంగదీసింది. వ్యక్తిగత సమస్యలతో పాటు వృత్తిపరంగా వెనుకబడటంలో ఉదయ్ కిరణ్ ప్రాణాలు తీసుకున్నారు.