కరోనా ఫస్ట్ వేవ్ కావొచ్చు.. సెకండ్ వేవ్ కావొచ్చు.. దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది సినీ పరిశ్రమ. ఈ నష్టం నాణేనికి రెండు వైపులా ఉండడం గమనార్హం. ఓ వైపు ఉపాధి లేక కార్మికులు అవస్థలు పడుతుంటే.. మరోవైపు సినిమాలు రిలీజ్ కాక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నిర్మాతలు కష్టాలు పడుతున్నారు. ఇలాంటి కండీషన్లోనూ తెలుగు ఇండస్ట్రీలో విచిత్రమైన పరిస్థితిని గమనించొచ్చు.
ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ వేళ పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. పెట్టుబడి భారం మోయలేని నిర్మాతలంతా ఓటీటీలతో బేరాలా ఆడేసి, సినిమాలను అమ్మేసుకున్నారు. కానీ.. ఈ సారి ఓటీటీకి తెలుగు సినిమాలు కరువైపోవడం గమనార్హం. ఏవో చిన్న సినిమాలు తప్ప, పేరున్న సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. అయ్యే అవకాశం కూడా కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటని ఆరాతీస్తే.. అడ్డుపడుతున్న హీరోలేనని తెలుస్తోంది.
ఓటీటీ అంటే బుల్లితెరకన్నా కంప్రెస్డ్ వర్షన్ గా ఫీలవుతున్న హీరోలు.. అందులో తమ బొమ్మ పడితే తమ రేంజ్ కూడా ఆ స్థాయికి పడిపోతుందని భావిస్తున్నారట. థియేటర్లో అయితే.. పోస్టర్లు, హంగామా ఆ లెక్క వేరే. అదే.. ఓటీటీలో విడుదలైతే మాత్రం ఎలాంటి ప్రచారమూ ఉండదు. సినిమా ఇలా వచ్చి, అలా వెళ్లిపోతుందని భావిస్తున్నారట. దానివల్ల తమ క్రేజ్ కు ముప్పు వాటిల్లుతుందని భయపడుతున్నారట.
ఈ సారి ద్వితీయ శ్రేణి సినిమాలు కూడా ఒక్కటంటే ఒక్కటీ.. ఓటీటీకి రాకపోవడానికి కారణం ఇదేనని చెబుతున్నారు. వకీల్ సాబ్ తర్వాత రావాల్సిన లవ్ స్టోరీ, టక్ జగదీష్, అరణ్య వంటి సినిమాలు కూడా థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుబడుతున్నారట హీరోలు.
కానీ.. ఇతర భాషల్లో పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అవుతుండడం గమనార్హం. మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం-2, బాలీవుడ్ లో సల్మాన్ రాధె వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. కానీ.. తెలుగు స్టార్లు మాత్రం ఇంకా ఇమేజ్ చట్రంలో ఇరుక్కొని నిర్మాతల గురించి పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుత్లో చేసేది లేక.. గడుస్తున్న రోజులను.. పెరుగుతున్న వడ్డీలను లెక్కించుకుంటూ కూర్చుంటున్నారట నిర్మాతలు.