చిత్ర పరిశ్రమను రెండో ఏడాది కూడా కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత బెరుకు బెరుగ్గా.. డిసెంబర్లో మొదటి సినిమా వచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో కూడా ‘క్రాక్’ వంటి సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టడంతో.. నిర్మాతలు ధైర్యంగా రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ప్రేక్షకులు సైతం థియేటర్లకు వస్తుండడంతో పరిస్థితి అంతా నార్మల్ అయినట్టుగానే భావించారు.
2021లో ఇప్పటి వరకు థియేటర్లో, ఓటీటీల్లో కలిపి మొత్తం 54 సినిమాలు విడుదలయ్యాయి. మొదటగా.. జనవరిలో సంక్రాంతిని టార్గెట్ చేసుకొని నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో విజయ్ ‘మాస్టర్’ డబ్బింగ్ కేటగిరీలో పడేస్తే.. అల్లుడు అదుర్స్, రెడ్, క్రాక్ సినిమాలు స్ట్రయిట్ మూవీస్. ఇందులో క్రాక్ మాత్రమే సూపర్ హిట్ కొట్టింది. మొత్తంగా ఈ నెలలో 14 సినిమాలు వచ్చాయి. కానీ.. క్రాక్ మాత్రమే ప్రాఫిట్ లో నిలిచింది.
ఆ తర్వాత ఫిబ్రవరిలోనూ 14 చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో జాంబి రెడ్డి ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత అల్లరి నరేష్ ‘నాంది’ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది. ఎంతో కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అల్లరోడికి మంచి బ్రేక్ ఇచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘ఉప్పెన’ సంచలనం సృష్టించింది. వసూళ్లు సునామి సాధించింది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ కేటగిరీలో ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పాడు. ఇక మిగిలిన చిత్రాలన్నీ నామమాత్రంగానే వచ్చి వెళ్లాయి.
ఇక, మార్చి సంగతి చూస్తే.. ఈ నెలలో మొత్తం 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో.. రంగ్ దే పర్వాలే దనిపించింది. అంచనాల మధ్య రిలీజ్ అయిన అరణ్య ఉసూరుమనిపించింది. కానీ.. పెద్దగా అంచనాల్లే కుండా వచ్చిన ‘జాతి రత్నాలు’ దుమ్ము లేపింది. రీజన్ లేని కామెడీకి జనాలు ఫిదా అయిపోయారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ అద్దిరిపోయే కలెక్షన్లు సాధించింది ఔరా అనిపించింది.
ఏప్రిల్ నెలలో నాలుగు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. ఇందులో అంచనాలతో వచ్చిన నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత వచ్చిన పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేలా ఓపెనింగ్స్ సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ బయటకు రాలేదుకానీ.. వంద కోట్లకు దగ్గరలో ఉన్నాయని టాక్. అయితే.. ఈ సినిమా థియేటర్లో ఉండగానే.. సెకండ్ వేవ్ విజృంభించడంతో.. అర్ధంతరంగా థియేటర్లు మూసేశారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ తర్వాత థియేటర్లో సినిమా రిలీజ్కాలేదు.
దీంతో.. ప్రేక్షకుడికి ఓటీటీనే దిక్కైంది. మేలో మూడు చిత్రాలు, జూన్లో రెండు తెలుగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘సినిమా బండి’ ఫర్వాలేదనిపించగా.. ‘ఏక్ మినీ కథ’ మంచి టాక్ తెచ్చుకుంది. ‘బట్టల రామస్వామి బయోపిక్’ సైతం పర్వాలేదనిపించింది. ఇవి కాకుండా.. ఇతర భాషలకు చెందిన చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ.. అవేవీ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయలేకపోయాయి.
సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు చక్కబడుతున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేయగా.. ఏపీలో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వాతావరణం అనుకూలంగానే ఉంటేనే థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. సినిమాలు విడుదల చేసే ఛాన్స్ ఉంది. కానీ.. ఇప్పుడప్పుడే ఇది జరిగేలా కనిపించట్లేదు. ఆగస్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. ఈ విధంగా సగం ఏడాదికి పైగా కరోనాకు సమర్పించుకున్నట్టే. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ అంటున్నారు. మరి, దీని ప్రభావం ఎప్పుడు మొదలవుతుంది? ఎలా కొనసాగుతుంది అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో రాబోయే అర్ధభాగం కూడా సినీ పరిశ్రమకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఏం జరుగుతుందన్నది చూడాలి.