Tollywood: క్రికెటర్ అవుదామని వచ్చి విలన్ అయ్యాడు… చిరంజీవి, బాలయ్యలకు సవాల్ విసిరిన ఆ యాక్టర్ ఎవరో తెలుసా?

క్రికెటర్ అవుదామని పరిశ్రమకు వచ్చిన ఓ యంగ్ ఫెలో యాక్టర్ అయ్యాడు. నటుడిగా ఎదిగే క్రమంలో అనేక కష్టాలు, నష్టాలు చూశాడు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు సవాల్ విసిరిన ఆ విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

Written By: S Reddy, Updated On : July 22, 2024 7:39 pm

Mukesh Rishi

Follow us on

Tollywood: ఎవరి డెస్టినేషన్ ఏమిటో ముందుగానే చెప్పడం చాలా కష్టం. ఇంజనీర్ చదివి సినిమా డైరెక్టర్స్ అయినవారు ఎందరో ఉన్నారు. డైరెక్టర్స్ అవుదామని యాక్టర్స్ అయినవారు… యాక్టర్ కావాలని వచ్చి డైరెక్టర్స్ అయిన వారు కూడా ఉన్నారు. ఒక్కోసారి మనం ఏమవుతామో.. అసలు మనలో ఉన్న నిజమైన టాలెంట్ ఏమిటో గుర్తించడం కష్టమే. అలా ఓ నటుడు క్రికెటర్ అవ్వాలనుకుని… అనూహ్యంగా యాక్టర్ అయ్యాడు. దేశం మెచ్చిన విలన్స్ లో ఒకడిగా ఎదిగాడు.

హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠితో పాటు పలు భాషల్లో నటించాడు. వందల సినిమాలు చేశాడు. ఆ యాక్టర్ ఎవరో కాదు ముఖేష్ రిషి. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు. అప్పల నాయుడు అంటే టక్కున గుర్తు పడతారు. ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు మూవీలో ముఖేష్ రిషి చేసిన పాత్ర పేరు అప్పలనాయుడు.

1956 ఏప్రిల్ 17న ముఖేష్ రిషి జమ్మూలో జన్మించాడు. వీరి తండ్రి వ్యాపారం చేసేవారు. వ్యాపారానికి ముంబై అనుకూలమని జమ్మూ నుండి ముంబైకి వచ్చేశారు. మొదట ముఖేష్ రిషికి క్రికెటర్ కావాలనే ఆసక్తి ఉండేదట. మంచి ఆటగాడు కూడాను. పంజాబ్ యూనివర్సిటీ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా చేశాడు. ముంబై వచ్చాక తండ్రి వ్యాపారాలు చూసుకోమని చెప్పాడట. కాదు నేను విదేశాల్లో చదువుకుంటానని ముఖేష్ రిషి ఫారిన్ వెళ్ళిపోయాడట.

అక్కడ చదువుకుంటూనే డిపార్ట్మెంటల్ స్టోర్ మేనేజర్ గా చేశాడట. కొందరు సన్నిహితులు నువ్వు నటుడిగా ప్రయత్నం చేయమని సలహా ఇచ్చాడట. మోడలింగ్ లో అడుగుపెట్టిన ముఖేష్ రిషి నటనలో శిక్షణ తీసుకున్నాడట. 1993లో విడుదలైన పరంపర హిందీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

తెలుగులో ముఖేష్ రిషి మొదటి చిత్రం గాండీవం. ఈ మూవీ 1994లో విడుదల కాగా ఆరేళ్ళ తర్వాత 2000లో మనోహరం చిత్రంలో విలన్ రోల్ చేశాడు. ముఖేష్ రిషిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం నరసింహనాయుడు. ఈ మూవీలో మెయిన్ విలన్ అప్పలనాయుడు అనే పాత్ర చేశాడు. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్. దర్శకుడు బి గోపాల్ ఇంద్ర మూవీలో మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఇంద్ర సైతం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముఖేష్ రిషిని ఉద్దేశించి ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పే… ”వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా” అనే డైలాగ్ బాగా ఫేమస్.

అక్కడ నుండి ముఖేష్ రిషికి తెలుగులో ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఒక్క తెలుగులోనే ముఖేష్ రిషి వంద చిత్రాల వరకు చేశాడు. ముఖేష్ రిషి నటించిన ఒక్కడు, సింహాద్రి భారీ విజయాలు సాధించాయి. కురుడు గట్టిన విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు ముఖేష్ రిషి. ఆరడుగులకు పైగా హైట్, ఫిట్ బాడీతో ముఖేష్ రిషి కట్ అవుట్ చూస్తే కేక అన్నట్లు ఉంటుంది. ఆయన ఈ పాత్రకైనా సెట్ అవుతారు.

ఈ మధ్య ముఖేష్ రిషికి ఆఫర్స్ తగ్గాయి. 2021లో వకీల్ సాబ్ చిత్రంలో కనిపించారు. అలాగే రవితేజ ఖిలాడీ చిత్రంలో నెగిటివ్ రోల్ చేశాడు. తెలుగులో ముఖేష్ రిషికి ఖిలాడీ చివరి చిత్రం.