Maa election: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ముగిసినా.. వివాదాలు మాత్రం సర్దుమనగలేదు. తాజాగా, ఎన్నికల నాటి సిసిటీవీ ఫుటేజీ కావాలని ప్రకాశ్రాజ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణ మోహన్.. ఎన్నికల నిర్వహణతో తన బాధ్యత పూర్తయిందని అన్నారు. ఆ తర్వాత జోక్యం చేసుకునే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు. ఎలక్షన్స్ జరిగిన రోజు, కౌంటింగ్ సమయంలో తనకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని.. లేదంటే అప్పుడే చర్యలు తీసుకునే వాడిననిఅన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఏం చేయాలనే అంశంపై అధ్యక్షుడికే అధికారాలున్నాయని మోహన్ అన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో వైకాపా నాయకుల జోక్యముందని ప్రకాశ్రాజ్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు.
‘మా’ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవలే ప్రకాశ్రాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాశారు. సీసీ ఫుటేజీ కావాలని అందులో కోరారు. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చూపిస్తూ మరోసారి సీసీ ఫుటేజీ ఇవ్వమని ట్విటర్ ద్వారా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ని కోరారు. దీంతో పాటు కొన్ని ఫొటోలను చూపిస్తూ.. అందులో వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావు ఎన్నికల హాలులో ఉన్నట్లు తెలిపారు. అసలు ఆయన్ను ఎందుకు లోపలికి అనుమతించారంటూ ప్రశ్నించారు.
సాంబశివరావు ఎన్నికల హాల్లోని ఓటర్లను బెదిరించారని.. ప్రకాశ్రాజ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో సాంబశివరావు ఉన్న కొన్ని ఫొటోలను కృష్ణమోహన్కు పంపించారు. జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్రాజ్ వివరించారు. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన వీడియోలను బయటపెడతానని ప్రకాశ్రాజ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ప్రకాశ్రాజ్.