కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. భారత్లో తీవ్ర దూరం దాల్చిన ఈ మహమ్మారి ఇప్పటికే రెండున్నరల లక్షల మందికి సోకింది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఎన్నో రంగాలు దెబ్బతిన్నాయి. అందులో ప్రధాన రంగం సినిమా ఇండస్ట్రీ. షూటింగ్స్, సినిమా విడుదల ఆగిపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులుతో పాటు ఇండస్ట్రీలో దినసరి వేతనంతో పని చేసే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే నిబంధనలు సడలించగా… తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో షూటింగ్స్ అనుమతి లభించింది. దాంతో షూటింగ్స్ కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ, వైరస్ వ్యాప్తి తగ్గకపోగా.. మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరిలో భయం ఇంకా పెరిగింది.
బాలీవుడ్లో పలువురు కరోనా బారిన పడి మృతి చెందడంతో ఇండస్ట్రీలో గుబులు రేగింది. కొంతమంది సీనియర్ నటులు షూటింగ్స్ కి వెళ్లడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా 60ఏళ్ళు పై బడిన నటులు ఇళ్లకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తాను ఇప్పట్లో షూటింగ్స్ కి హాజరు కాని స్పష్టం చేశారు. అలాగే తన కూతురు శ్రద్దా కపూర్ ను కూడా ఇంటి నుంచి బయటకు పంపించనని చెప్పారు. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసిన శ్రద్ధా… ప్రభాస్ సరసన ‘సాహో’లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో తాను షూటింగ్స్ లో పాల్గొనాలనుకోవడం లేదని, శ్రద్ధాను కూడా పంపించబోనని శక్తి చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు కాబట్టి మున్ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయన్నారు. ఇప్పుడు మనిషి ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. వైరస్ ప్రభావం తగ్గకముందే షూటింగ్స్ ప్రారంభించడం భావ్యం కాదని, ఇంకొంత కాలం వేచిచూడడం మంచిదన్నారు.