టాలీవుడ్ కి పాకిన సీక్వెల్ వైరస్

సూపర్ సక్సెస్ సాధించిన చిత్రాలకు సీక్వెల్ నిర్మిస్తే ఆర్ధికంగా నిర్మాతకు ఎంతో కొంత లాభముంటుంది. కనెక్ట్ అయిన పాత్రలకు కొనసాగింపు అవ్వడం వలన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఎక్కువ. ఈ రకమైన చిత్ర నిర్మాణం హాలీవుడ్ లో బాగా వేళ్ళూనుకొంది. అక్కడ లెక్కకు మిక్కిలిగా సీక్వెల్ చిత్రాలు వచ్చాయి. వాటిలో సూపర్ మాన్ సిరీస్ , రాంబో సిరీస్ , అవెంజర్స్ సిరీస్ లాంటి చిత్రాలు విశ్వ వ్యాప్తంగా బాగా వసూళ్లు సాధించాయి. ఇంకా ఎన్నో […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 7:27 pm
Follow us on

సూపర్ సక్సెస్ సాధించిన చిత్రాలకు సీక్వెల్ నిర్మిస్తే ఆర్ధికంగా నిర్మాతకు ఎంతో కొంత లాభముంటుంది. కనెక్ట్ అయిన పాత్రలకు కొనసాగింపు అవ్వడం వలన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఎక్కువ. ఈ రకమైన చిత్ర నిర్మాణం హాలీవుడ్ లో బాగా వేళ్ళూనుకొంది. అక్కడ లెక్కకు మిక్కిలిగా సీక్వెల్ చిత్రాలు వచ్చాయి. వాటిలో సూపర్ మాన్ సిరీస్ , రాంబో సిరీస్ , అవెంజర్స్ సిరీస్ లాంటి చిత్రాలు విశ్వ వ్యాప్తంగా బాగా వసూళ్లు సాధించాయి. ఇంకా ఎన్నో లెక్క లేనన్ని చిత్రాలు వచ్చాయి, రాబోతున్నాయి.

అలా ఆంగ్ల చిత్రాల స్ఫూర్తి తో హిందీలో కూడా సీక్వెల్ చిత్రాలు బాగానే వచ్చాయి. మనకు తెలిసినంత వరకూ హిందీ లో వచ్చిన మొదటి సీక్వెల్ చిత్రం అలనాటి హీరోయిన్ నాడియా నటించిన హంటర్ వాలి కి భేటీ యే. ఇది 1935 లో వచ్చిన హంటర్ వాలి చిత్రానికి సీక్వెల్. కాగా ఈ చిత్రం 1943 లో వచ్చింది. అలా మొదలైన సీక్వెల్ చిత్రాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలం లో వచ్చిన గోల్ మాల్, హౌస్ ఫుల్, డాన్, దబాంగ్ , ధూమ్, క్రిష్ , బాఘీ , మున్నా భాయ్ ,హేరా ఫేరీ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకొని మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.
ఈ సీక్వెళ్ల పరంపర ఇతర భాషల్లో కూడా కొనసాగుతోంది. రీసెంట్ గా తమిళం లో వచ్చిన బిల్లా, రోబో, పందెం కోడి, మారి, కాంచన , సింగం వంటి చిత్రాలు తమిళ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టు కొన్నాయి. ఇపుడు ఇదే వరుసలో భారతీయుడు, నాడోడిగళ్[ తెలుగులో శంభో శివ శంభో] వంటి చిత్రాలు వసున్నాయి. ఇంకా అనేక చిత్రాలు నిర్మాణ సన్నాహాలు చేసుకొంటున్నాయి.

ఇపుడు ఇక తెలుగు చిత్రాలు కూడా సీక్వెళ్ల వైపు అడుగు లేస్తున్నాయి. ఈ క్రమంలో 1978 లో వచ్చిన మొదటి సీక్వెల్ చిత్రం దేవదాస్ మళ్ళీ పుట్టాడు తరవాత తెలుగులో నిర్మాణం జరుపుకున్న చిత్రాలు చాలా తక్కువ అనే చెప్పాలి. మనీ , గాయం, అవును, గబ్బర్ సింగ్, కిక్ , ఆర్య, రక్త చరిత్ర, మంత్ర, శంకర్ దాదా వంటి చిత్రాలు సీక్వెల్స్ గా రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో తెలుగు నిర్మాతలకు సీక్వెల్ చిత్రాల ఫై నమ్మకం సన్న గిల్లింది. ఆ దిశగా ఆలోచించడం మానేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు సీక్వెల్సే బెటర్ అన్న నమ్మకం తో కొందరు నిర్మాతలు ముందుకొస్తున్నారు. వారిలో పెద్ద ,చిన్న నిర్మాతలు ఉన్నారు. ముందుగా చెప్పుకోవాల్సి వస్తే నాగార్జున గురించే చెప్పు కోవాలి. 2016 లో తాను హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ కి సీక్వెల్ రెడీ చేయించాడు. అది త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ కృష్ణే రెండో చిత్రానికి కూడా దర్శకత్వం వహించ బోతున్నాడు. ఇక ఈ చిత్రానికి బంగార్రాజు అని టైటిల్ పెట్ట బోతున్నారు. గతంలో రాజుగారి గది అనే సీక్వెల్ చిత్రంలో నాగార్జున నటించగా అది కాస్త ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ సబ్జెక్టు మీద నమ్మకం తో సోగ్గాడే సీక్వెల్ కి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక నాగార్జున తనయుడు నాగ చైతన్య నటించిన హిట్ చిత్రం ఏ మాయ చేసావే చిత్రానికి కూడా సీక్వెల్ రూపొందుతున్నట్టు తెలుస్తోంది.తొలి చిత్ర దర్శకుడు అయిన గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి కూడా దర్శకుడిగా వ్యవహరించ బోతున్నాడు.

ఇక బయటి చిత్రాల విషయానికి వస్తే 2014 లో నిఖిల్ హీరోగా వచ్చిన సోషియో థ్రిల్లర్ కార్తికేయ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. యానిమల్ హిప్నటైజ్ కధాంశం తో వచ్చిన తొలి చిత్రం ఘన విజయం సాధించిన నేపధ్యం లో ఈ సీక్వెల్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రీసెంట్ గా తిరుపతిలో షూటింగ్ కూడా మొదలెట్టారు. తొలి చిత్ర దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక చివరగా చెప్పుకోవాల్సింది తాజాగా విజయం సాధించిన చిన్న చిత్రం ” హిట్ ” గురించి ….విశేషం ఏమిటంటే ఈ సినిమా నిర్మాణ సమయం లోనే సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ చేశారు. నిర్మాత దర్శకులు ఊహించిన విధం గానే సినిమా సక్సెస్ అవ్వడం తో త్వరలోనే సీక్వెల్ నిర్మాణం చేయ బోతున్నారు.