Sarkaru Vaari Paata: కరోనా థర్డ్ వేవ్ ధాటికి దేశంలోని అన్ని రంగాలు మళ్లీ కుదేలవుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మరి వెంటాడుతోంది. కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ లలో సినిమా థియేటర్లు, షూటింగులు నిలిచిపోయాయి. ఎంతోమంది సినీ ప్రముఖ ఈ మహమ్మరి బారినపడి మృత్యువాత పడిన సంఘటనలున్నాయి.
ఇక కరోనా థర్డ్ వేవ్ ఎంట్రీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. చివరికీ ఆయన అన్నయ్య రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు నోచుకోని దయనీయ పరిస్థితి ఇటీవల నెలకొంది.
మహేష్ బాబు ప్రస్తుతం పర్శురాం దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమె సైతం ఇటీవల కరోనా బారిన పడ్డారు. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ కరోనా బారినపడ్డారు. దీంతో ‘సర్కారువారిపాట’ యూనిట్లో కరోనా టెన్షన్ మొదలైంది.
ఈనేపథ్యంలోనే ‘సర్కారువారిపాట’ మూవీ షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా పడింది. ఈ సినిమాకు పని చేసిన వారంతా ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకొని అప్రమత్తంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే ఏప్రిల్ ఒకటో తేదిన విడుదల కావాల్సిన ‘సర్కారువారిపాట’ వాయిదా పడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
అదేవిధంగా మహేష్ బాబు మెకాలికి ఇటీవలే సర్జరీ జరిగింది. దీంతో ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. మొత్తానికి ‘సర్కారువారిపాట’ అనుకున్న రిలీజు కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.