Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అల్లర్లు కేసులో కోర్టు కీలక ఆదేశాలు… రైతు బిడ్డ రియాక్షన్ ఏంటో?

అరెస్ట్ అయిన రెండు రోజులకు పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అతనికి షరతులతో కూడిన బెయిల్ నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆదివారం ప్రశాంత్ పోలీసుల ముందు హాజరు కావాలి.

Written By: S Reddy, Updated On : February 25, 2024 6:05 pm
Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతీరు, ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కష్టపడి ఆడి టైటిల్ కొట్టాడు. కానీ ఆ సంతోషం లేకుండా అంతా గందరగోళం అయింది. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన ఫ్యాన్స్ ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసం సృష్టించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగలగొట్టారు. బస్సుల మీదకు రాళ్లు రువ్వారు. పరోక్షంగా ఈ అల్లర్లకు ప్రశాంత్ కారణం అవడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించింది.

అరెస్ట్ అయిన రెండు రోజులకు పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అతనికి షరతులతో కూడిన బెయిల్ నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆదివారం ప్రశాంత్ పోలీసుల ముందు హాజరు కావాలి. చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది. దీంతో పల్లవి ప్రశాంత్ రెండు నెలలుగా ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ లో సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో రిలాక్సేషన్ పిటిషన్ ప్రశాంత్ తరపు లాయర్లు కోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దీంతో ప్రశాంత్ అతని సోదరుడు మనోహర్ కు కొంత మేరకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు . ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి పాటను తన వీడియోకు అనుబంధంగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియో చూసిన నెటిజన్లు ప్రశాంత్ కి వంత పాడుతున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇదంతా చూసి సంతోషంగా ఉంది. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది. మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో రిమాండ్ కి వెళ్లిన పల్లవి ప్రశాంత్, మనోహర్ లకు ఊరట లభించింది.