MLA Roja : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా.. 90వ దశకంలో రోజా హవా కొనసాగించారు. అందంతోపాటు అద్భుతమైన అభినయం కలగలిసిన ఆమె.. చాలా కాలంపాటు ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న ఆమె.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత జబర్దస్త్ షో జడ్జిగా బుల్లితెరపైనా అరంగేట్రం చేశారు. ఈ రెండు రంగాల్లోనూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్న రోజా.. తన వ్యక్తిగత విషయాలను తాజాగా పంచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి. 1991లో విడుదలైన ‘సర్పయాగం’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే మంచి నటన కనబరిచిన ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ విధంగా అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గాఎదిగారు. సౌత్ లోని ఇతర ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటారు. ఆ తర్వాత వెండి తెరకు దూరమైన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లిపాత్రలు చేశారు. ఇదే సమయంలో జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వచ్చారు. ఈ షో ఎంత సక్సెస్ అయ్యిందో.. రోజా కూడా ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. బుల్లి తెరను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్వహించే ప్రతీ షోలోనూ రోజా కనిపిస్తున్నారు. ప్రతీ అకేషన్ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. త్వరలో వినాయక చవితి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ‘ఊరిలో వినాయకుడు’ అనే షోను ప్లాన్ చేశారు. ఇందులో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు రోజా.
ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రోజా మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు. ‘నేను 1991లో సినిమాల్లోకి వచ్చాను.. 2002 వరకు కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం అప్పులు కట్టి నరకం అనుభవించా’ అని తన ఆర్థిక కష్టాలను తలుచుకొని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇంతేకాకుండా.. ఎవరికీ తెలియని తన వ్యక్తిగత సమస్యలను కూడా కూడా బయట పెట్టారు.
తనకు పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టరేమోననే భయం ఉండేదని చెప్పారు రోజా. ‘‘పెళ్లి చేసుకునే ముందే నాకు చాలా పెద్ద భయం ఉండేది. పెళ్లైన తర్వాత నాకు పిల్లలు పుట్టరని అనుకునేదాన్ని. కానీ.. లక్కీగా వివాహం జరిగిన ఏడాదికే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అన్షు పుట్టింది. అందుకే అన్షు అంటే నాకు చాలా చాలా ఇష్టం’’ అని కన్నీరు పెట్టుకున్నారు రోజా. ఈ సమయంలో పక్కనున్నవారు ఓదార్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.