Mega Allu Controversy: మెగా-అల్లు వివాదం… ఇంత డ్యామేజ్ జరుగుతుంటే, చిరంజీవి-అల్లు అరవింద్ ఏం చేస్తున్నారు?

మెగా-అల్లు కుటుంబాల మధ్య చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నారు. అల్లు అర్జున్ కేంద్రగా ఓ కోల్డ్ వార్ మొదలైంది. పరోక్షంగా ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలెట్టారు. వివాదం అంతకంతకు పెద్దదవుతున్న తరుణంలో పెద్దలు చిరంజీవి, అల్లు అరవింద్ ఎందుకు కలగ జేసుకోవడం లేదనే వాదన మొదలైంది.

Written By: S Reddy, Updated On : August 26, 2024 1:38 pm

Mega Allu Controversy

Follow us on

Mega Allu Controversy: టాలెంట్ కి బ్రాండ్ ఇమేజ్ తోడైతే విజయం సాధించడం సులభం అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా ఎదగడంలో మెగా హీరో ట్యాగ్ ఉపయోగపడిందనేది ఒప్పుకోవాల్సిన నిజం. అలా అని మెగా హీరోలందరూ స్టార్స్ అయ్యారా? అంటే… కాలేదు. అల్లు అర్జున్ కి టాలెంట్ ఉంది. చిరంజీవి నట వారసుల్లో ఒకడన్న గుర్తింపు బూస్ట్ ఇచ్చింది. అదే సమయంలో అల్లు అర్జున్ కేవలం ప్రతిభతో బడా హీరో అయ్యాడు అనడం కూడా కరెక్ట్ కాదు.

ఒక దశకు వచ్చాక అల్లు అర్జున్ మెగా ట్యాగ్ వద్దనుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు. చిరంజీవి మేనల్లుడు అనిపించుకోవడం కంటే… అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ కొడుకుగా గుర్తింపు కావాలని అంటున్నాడు. అందుకు కారణం ఏమిటో అల్లు అర్జున్ కే తెలియాలి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ అల్లు అర్జున్ చేసిన పని రెండు కుటుంబాల మధ్య చిచ్చు రాజేసింది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అహర్నిశలు పనిచేసింది. ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి పంపాలని మెగా హీరోలు కష్టపడ్డారు.

నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ నేరుగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగబాబు సతీమణి ఇంటింటి ప్రచారంలో పాల్గొంది. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని వీడియో బైట్ విడుదల చేశాడు. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురం వెళ్ళాడు. అదే రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాడు. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి స్వయంగా వెళ్లి అతనికి ఓటు వేసి గెలిపించాలని కోరాడు.

పరోక్షంగా అల్లు అర్జున్ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినట్లు అయ్యింది. అల్లు అర్జున్ చర్య మెగా ఫ్యామిలీకి నచ్చలేదు. నాగబాబు సాయి ధరమ్ పరోక్షంగా తమ అసహనాన్ని బయటపెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే అనే వాదన తెరపైకి వచ్చింది. ఒకప్పుడు హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పటి హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా వాడిగా ఈ తరహా పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అర్జున్ మెగా హీరోలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. నాకు నచ్చితే, ఇష్టమైతే ఎక్కడికైనా వస్తాను… అన్నారు. మొన్నటి వరకు ఇండైరెక్ట్ గా సాగిన మాటల యుద్ధం.. ప్రత్యక్ష రూపం తీసుకుంది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి… పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని తప్పుబట్టారు. అల్లు అర్జున్ చేసింది సినిమాలో పాత్రమే మాత్రమే. నిజంగా స్మగ్లింగ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ సరికాదనట్లు అసహనం వ్యక్తం చేశాడు.

జరుగుతున్న ఒక్కో పరిణామం మెగా-అల్లు కుటుంబాల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సోషల్ మీడియాలో మెగా హీరోల ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఇంత డ్యామేజ్ జరుగుతుంటే రెండు కుటుంబాల పెద్దలైన చిరంజీవి-అల్లు అరవింద్ ఏం చేస్తున్నారనే వాదన మొదలైంది. వీరిద్దరూ రంగంలోకి దిగి ఈ వివాదానికి అడ్డుకట్ట వేయాలని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. చిరంజీవి, అల్లు అరవింద్ ల అనుబంధం, సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. ఒక కుటుంబంగా టాలీవుడ్ ని శాసిస్తున్న మెగా హీరోలు విడిపోయి కొట్టుకోవడం ఆపేయాలని మ్యూచువల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.