Reliance Power Share: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి నిధుల మళ్లింపు ఆరోపణలపై అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు రెండు ట్రేడింగ్ సెషన్లలో 9.7 శాతం పడిపోయాయి. సోమవారం (ఆగస్ట్ 26) బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్ ను తాకి రూ. 32.73 వద్ద కనిష్టానికి పడిపోయింది. అనిల్ అంబానీతో సహా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్ఎఫ్హెచ్ఎల్) కీలక నిర్వాహకులు లిస్టెడ్ కంపెనీ (ఆర్హెచ్ఎఫ్ఎల్) నుంచి నిధులను ‘రుణాలు’గా తీసుకొని, అనర్హులైన రుణ గ్రహీతలకు మళ్లించారని మార్కెట్ రెగ్యులేటర్ తన 222 పేజీల సుదీర్ఘ ఉత్తర్వుల్లో వివరించింది. రిలయన్స్ పవర్ డైరెక్టర్ల బోర్డు నుంచి అనిల్ అంబానీ వైదొలిగారని, సెబీ ఉత్తర్వులు కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని కంపెనీ ఆదివారం ఎక్స్ఛేంజీలకు ఫైలింగ్ ద్వారా తెలియజేసింది. సెబీ ముందు జరిగిన విచారణలో రిలయన్స్ పవర్ లిమిటెడ్ నోటీసు లేదా పార్టీ కాదని పేర్కొంది. రిలయన్స్ పవర్ లిమిటెడ్ కు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇదే ప్రొసీడింగ్స్ లో సెబీ 11 ఫిబ్రవరి, 2022 జారి చేసిన నాటి మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు నుంచి రాజీనామా చేశారు. దీని వల్ల సెబీ 2024, ఆగస్ట్ 22న జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. రిలయన్స్ పవర్ లిమిటెడ్ వ్యాపారం, వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపదు’ అని కంపెనీ ఒక ఫైలింగ్ లో పేర్కొంది.
అంబానీతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ కీలక అధికారులు సహా మరో 26 సంస్థలపై ఐదేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బహిష్కరించడంతో అంబానీకి సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. ఫిబ్రవరి 2020లో యూకే కోర్టు ఎదుట దివాలా ప్రకటించిన పారిశ్రామికవేత్త.. ఏదైనా లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ లేదంటే కీ మేనేజియల్ పర్సనల్ (కేఎంపీ) లేదా మార్కెట్ రెగ్యులేటర్ వద్ద నమోదైన మధ్య వర్తితో సహా సెక్యూరిటీస్ మార్కెట్ తో ఐదేళ్ల పాటు సంబంధం కలిగి ఉండకుండా నిరోధించబడింది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 6 నెలల పాటు నిషేధించిన రెగ్యులేటర్ రూ. 6 లక్షల జరిమానా విధించింది. తనకు లేదా ఏడీఏ గ్రూపునకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న సంస్థలకు నిధుల మళ్లింపు జరిగిందని పరిగణనలోకి తీసుకుంటే అంబానీ దీనికి ప్రధాన సూత్రధారి అని సెబీ స్పష్టం చేసింది.
ఇటీవల, 600 మెగావాట్ల బుటిబోరి థర్మల్ ప్లాంట్ ను అదానీ పవర్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత స్టాక్ 4 సెషన్స్ లో దాదాపు 21 శాతం పెరిగింది. రూ. 2,400 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల మధ్య విలువ చేసే ఈ కొనుగోలుకు రిలయన్స్ పవర్ విభాగమైన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ తో అదానీ పవర్ సంప్రదింపులు జరుపుతోందని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.