Konda Surekha: ఎక్కడా ‘పడుకో’ అనలేదు.. కొండా సురేఖ లాయర్ చేసిన కామెంట్స్ వైరల్.

సమంత - నాగచైతన్య విడాకుల వ్యవహారంలో ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. దీనిని భారత రాష్ట్ర సమితి పదేపదే గెలకడంతో జాతీయస్థాయిలో కూడా చర్చకు దారి తీసింది. దీనిపై సినీ నటుడు నాగార్జున కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 9, 2024 12:05 pm

Konda Surekha(3)

Follow us on

Konda Surekha: సమంత – నాగచైతన్య విడాకులపై వ్యాఖ్యలు చేసిన తర్వాత అది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీయడంతో.. సురేఖ నాలుక కరుచుకున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు ఆమె క్షమాపణలు చెప్పారు. అయితే కేటీఆర్ పై తన పంథా మారదని సురేఖ స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కూడా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మధ్యలో చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్లంతా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. చిరంజీవి నుంచి మొదలు పెడితే ప్రభాస్ వరకు సురేఖ మాట్లాడిన మాటలు సరికావని పేర్కొన్నారు.. ఇది ఇలా ఉండగానే సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున కోర్టు మెట్లు ఎక్కారు. సురేఖ పై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు సంబంధించి విచారణ ఇంకా మొదలు కాలేదు. అయితే ఈ లోగానే అక్కినేని కుటుంబం పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమర్థించడానికి ఆమె తరుపు లాయర్ ప్రయత్నించారు. ఇదే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. సురేఖ ఎక్కడ కూడా “పడుకో” అనలేదని.. అసభ్యకరంగా మాట్లాడలేదని.. నాగార్జున కుటుంబానికి పరువు నష్టం కలిగించే విధంగా ఆమె వ్యవహరించలేదని.. దీనిపై డిఫమేషన్ కేసు వేయడం సరికాదని ఆ లాయర్ పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో సురేఖ గెలుస్తారని ఆమె వివరించారు..

రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. కోర్టు చేతిలో మొట్టికాయలు తినడం మనదేశంలో రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో నరేంద్ర మోడీపై అనుచితంగా వ్యాఖ్యానించారు. దానిపై బిజెపి నాయకులు కోర్టును ఆశ్రయించారు.. దీంతో కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఫలితంగా రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలో రాహుల్ గాంధీ కి బాసటగా అనేక పార్టీలు నిలిచాయి. రాహుల్ గాంధీకి సానుభూతి లభించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. పరువు నష్టం దావా కేసుల్లో ఒక పట్లగా కోట్లు సైలెంట్ గా ఉండడం లేదు. రాజకీయ నాయకులు నోరు అదుపులోకి పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖ నేకుతారని ఆమె తరఫు లాయర్ చెబుతున్నప్పటికీ.. ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి . అయితే తాను కేటీఆర్ ను ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశానని.. అంటే తప్ప అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ఎలాంటి విమర్శలు చేయలేదని సురేఖ సమర్ధించుకున్నప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే సురేఖకు మద్దతుగా ఇటీవల మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇప్పటికే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టామని.. దీనిని ఇంకా రగిలించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభాకర్ హెచ్చరించారు.. దీంతో ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పటికైతే నివురు గప్పిన నిప్పులాగానే ఉంది. తర్వాత ఏం జరుగుతుందనేది రోజులు గడిస్తే గాని తెలియదు..