Kamal Haasan Sabha Speech: విలక్షణ నటుడు.. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తొలి ప్రసంగం గూస్బంప్స్ తెప్పించింది. డీఎంకే తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కమల్.. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఆందోళన తెలిపారు. తమిళనాడులో ఈ ప్రక్రియతో కోటి మంది ఓటర్ల హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉందని, స్పెల్లింగ్ లేదా అడ్రస్ తప్పులపై ఏకపక్ష వ్యవహారం జరుగుతోందని విమర్శించారు. దీన్ని ‘స్పెల్ చెక్డ్ స్టోరీ ఆఫ్ ది లివింగ్ డెడ్‘గా సంబోధించారు.
శ్రీశ్రీ కవిత్వంతో ప్రారంభం…
ప్రజాస్వామ్య భారతాన్ని ఎవరూ అడ్డుకోలేరని నొక్కి చెప్పేందుకు శ్రీశ్రీ కవిత్వాన్ని ఉదహరించారు. ‘జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయ్… వస్తున్నాయ్‘ అనే పద్యం చదివి, ఈ రథం విభేదాలను తొలగించాలి కానీ ప్రజలను కాదని హెచ్చరించారు. తెలుగు ప్రేక్షకులకు దీని అర్థం సులభంగా తెలుస్తుందని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల ఉదాహరణ..
బిహార్లో ఎస్ఐఆర్ ‘జీవచ్ఛవాల భూమి‘గా మారిందని ప్రస్తావించారు. ఈ వ్యాధి దేశవ్యాప్తం కాకుండా చూడాలని సూచించారు. ఎన్నికల సంఘం దీనికి సహకరిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.
సినిమా నుంచి సభలోకి..
సినిమా రంగం నుంచి పార్లమెంట్కు వచ్చిన కమల్ తనను పరిచయం చేసుకున్నారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎన్ అణ్ణాదురై, మహాత్మా గాంధీ బోధనలు తన భాష, ఆలోచనలపై ప్రభావం చూపాయని తెలిపారు. భాష, సంస్కృతి, హక్కులపై దాడులకు ఎదిరించి నిలబడాలని అణ్ణాదురై నేర్పారని గుర్తు చేశారు.
ఎవరూ శాశ్వతం కాదని, ప్రభుత్వాలు కూడా అని హెచ్చరించారు. యువత (జెన్ జెడ్) చూస్తున్నారని, ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పరిణతి సాధించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు సమస్యలపై సహకారం కోరుకుంటూ, ప్రజాస్వామ్య రథాన్ని ముందుకు నడిపించాలని కోరారు.